వడ్డీ రేట్లు, యూపీ ఎన్నికలు: వచ్చే ఏడాది మార్కెట్లో భారీ కరెక్షన్!?
కరోనా సెకండ్ వేవ్ అనంతరం స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. స్టాక్ మార్కెట్-బులియన్ మార్కెట్-వడ్డీ రేట్లకు అవినాభావ సంబంధం ఉంటుంది. గత ఏడాది కరోనా ప్రారంభమైనప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 26,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. అదే సమయంలో ఆర్థిక రికవరీ-డిమాండ్ కోసం కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను దశాబ్దాల కనిష్టానికి తగ్గించింది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం, ఆ తర్వాత క్రిప్టో కరెన్సీ వైపు చూశారు. సాధారణంగా చాలామంది తమ చేతిలో ఉన్న మొత్తాన్ని ఆర్థిక సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు.
ఇది ఫిక్స్డ్ డిపాజిట్ రూపం కావొచ్చు లేదా రికరింగ్ డిపాజిట్ రూపం కావొచ్చు. మరేదైనా కావొచ్చు. కరోనా కారణంగా వడ్డీ రేట్లు పడిపోయాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్ ఆందోళనగా ఉంది. స్టాక్స్లో పెట్టుబడి రిస్క్గా భావించారు. దీంతో బంగారం, బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు క్రమంగా సాధారణ స్థితికి వస్తోంది. దీంతో స్టాక్ మార్కెట్ పుంజుకుంటోంది. అయితే స్టాక్స్ మార్కెట్ జోరు ఇలాగే కొనసాగుతుందా, ఎంతవరకు?
బ్యాంకుల్లో పెట్టుబడికి నిరాసక్తత
స్టాక్ మార్కెట్ పెరుగుదల, బంగారం ధర ముందుకు సాగడం సాధారణమే. కానీ ఇటీవల స్టాక్ మార్కెట్లు అనూహ్య రీతిలో ఆల్ టైమ్ గరిష్టాలను తాకుతున్నాయి. కరోనాకు ముందు 42,000 స్థాయిలో ఉన్న సెన్సెక్స్, కరోనా కారణంగా 26,000 దిగువకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత పుంజుకుంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో స్టాక్ మార్కెట్లో, బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. కానీ మార్కెట్ ఊగిసలాటలో ఉండటంతో కేవలం బంగారం వైపు మాత్రమే చూశారు.
దీంతో బంగారం గత ఏడాది ఆగస్ట్ 5న ఆల్ టైమ్ గరిష్టం రూ.56200కు చేరుకుంది. అయితే ఆ తర్వాత స్టాక్ మార్కెట్ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు స్టాక్స్లోను పెట్టుబడి పెడుతున్నారు. ఆర్థిక రికవరీ కోసం వడ్డీ రేట్లను మరింతకాలం ఆల్ టైమ్ కనిష్టం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో ఇన్వెస్టర్లు ఇప్పటికి ఇప్పుడు బ్యాంకుల్లో పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు.
స్టాక్స్.. బంగారం.. క్రిప్టో
వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో సాధారణ పౌరుల నుండి దాదాపు అందరూ తమ పెట్టుబడిని ఇటు స్టాక్స్లో, అటు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంలో, అలాగే, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది (2022) ఉత్తర ప్రదేశ్లో కీలక అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ జయాపజయాలపై కూడా స్టాక్ మార్కెట్ ఆధారపడి ఉంటుంది. యూపీ ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్లో భారీ కుదుపు ఉండవచ్చు. కరోనా తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తోన్న చిన్న ఇన్వెస్టర్లు పెరిగారు. మరోవైపు క్రిప్టోలోను ఇన్వెస్ట్ చేయడం పెరుగుతోంది.
అప్పుడే భారీ కరెక్షన్
వడ్డీ రేట్లు తిరిగి పెరిగే వరకు స్టాక్ మార్కెట్ దూకుడు కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. ఏడాది నుండి, ఏడాదిన్నర కాలంలో వడ్డీ రేట్లు తిరిగి కరోనా ముందుస్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నంత కాలం బుల్ రన్ ఉంటుందని చెబుతున్నారు. వడ్డీ రేట్ల పెరుగుదల ప్రారంభమయ్యాక మార్కెట్ కరెక్షన్కు గురవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం డిపాజిట్స్ పైన వడ్డీ రేటు ఐదు శాతం కంటే తక్కువగా ఉంది. ఈ రేట్లు 7 శాతం నుండి 8 శాతానికి పెరిగితే తప్ప భారీ కరెక్షన్ ఉండకపోవచ్చునని చెబుతున్నారు.