ఈ వారం మార్కెట్ ఎలా ఉండవచ్చు, బంగారం ధరలు తగ్గుతాయా?
స్టాక్ మార్కెట్లు గతవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2 శాతం మేర క్షీణించాయి. సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా పతనమైంది. దేశీయ పరిణామాలు, అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో మార్కెట్లు క్రితం వారం నష్టపోయాయి. ఈ వారం కూడా మార్కెట్లు కాస్త ప్రతికూలంగానే కదలాడవచ్చునని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ త్రైమాసికం ఫలితాలు అదరగొట్టాయి. మిగతా కంపెనీల ఆర్థిక ఫలితాల పైన కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. ఎఫ్ఎంసీజీ, సిమెంట్ షేర్లు మాత్రం సానుకూలంగా కదలాడే అవకాశాలు ఉన్నాయి. మెటల్ స్టాక్స్ ఒత్తిడికి గురి కావొచ్చు.
గతవారం నష్టాల్లో...
రిటైల్ ద్రవ్యోల్భణం పదిహేడు నెలల గరిష్టం 6.95 శాతానికి చేరుకుంది. ఆహార, ఇంధన ధరలు భారీగా పెరిగాయి. పారిశ్రామిక ఉత్పత్తి ఫిబ్రవరిలో 1.7 శాతం వృద్ధి నమోదు కాగా, మార్చిలో ఎగుమతులు 20 శాతం పెరిగాయి. అదే సమయంలో దిగుమతులు 24 శాతం పెరిగాయి. దీంతో వాణిజ్య లోటు 18.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే, గతవారం మార్కెట్ కేవలం మూడు రోజులు మాత్రమే పని చేయడంతో దీర్ఘకాల సెలవుల కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. డాలర్ మారకంతో రూపాయి 76.17కు బలహీనపడింది. మార్చిలో అమెరికా ద్రవ్యోల్భణం రికార్డ్ స్థాయికి పెరిగింది.
మార్జిన్ ఆందోళన
గతవారం మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 58,339 పాయింట్లు, నిఫ్టీ 17,475 పాయింట్ల వద్ద ఈ వారాన్ని ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో అననుకూల పరిస్థితులు ఉంటే సెన్సెక్స్ 56,500 దిగువకు పడిపోవచ్చునని, సానుకూలంగా ఉంటే 59,000కు చేరుకునే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ వర్గాల అంచనా. నిఫ్టీ ఈ వారం 17600 నుండి 17800 మధ్య కదలాడవచ్చునని భావిస్తున్నారు. ఐటీ కంపెనీల నుండి సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ స్వల్పకాలంలో మార్జిన్స్ పైన ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్ ఊగిసలాటలో ఉండవచ్చు. ధరల పెరుగుదల అంచనాలతో సిమెంట్ రంగం పుంజుకుంది.
వీటి ప్రభావం
అంతర్జాతీయ సంకేతాలు, రష్యా-ఉక్రెయిన్ పరిణామాలతో దేశీయ సూచీల స్థిరీకరణ కొనసాగే అవకాశాలు ఉన్నాయని, కంపెనీ త్రైమాసిక ఫలితాలు, మేనేజ్మెంట్ వ్యాఖ్యలతో షేర్/రంగం ఆధారిత కదలికలు కొనసాగవచ్చునని అంటున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా బాండ్ రాబడులు పెరుగుతున్నాయి. దీంతో వడ్డీ రేట్ల పెంపు విషయంలో కేంద్ర బ్యాంకులు సానుకూలంగా ఉండవచ్చుననే అంచనాలు ఒడిదుడుకులకు గురి చేయవచ్చు. రిటైల్ ద్రవ్యోల్భణం, బ్యాంకుల రుణ వృద్ధి గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు.
బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు గతవారం భారీగా పెరిగాయి. ఈ వారం స్వల్పంగా క్షీణత నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం రూ.53,000ను తాకింది. అయితే ఈ వారం నష్టపోతే రూ.52,300 దిగువకు రావొచ్చునని, మరింత క్షీణిస్తే రూ.51,500 స్థాయికి రావొచ్చునని భావిస్తున్నారు. రాణిస్తే మాత్రం స్వల్ప పెరుగుదలతో రూ.53,400 స్థాయికి చేరుకోవచ్చునని అంటున్నారు. రూ.52,600 వద్ద స్టాప్ లాస్, రూ.53,635 టార్గెట్ ధరతో రూ.53,400 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.
ఇక రూ.69,000 వద్ద ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67,500 దిగువకు పడిపోవచ్చునని, ఆ స్థాయి కంటే దిగువకు వస్తే రూ.66,000 స్థాయికి రావొచ్చునని అంటున్నారు. సానుకూలంగా ఉంటే మాత్రం రూ.70,000కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.