Sovereign Gold Bond scheme: రేపటి నుండే సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం (SGB) 2021-22-సిరీస్ X సబ్స్క్రిప్షన్ను రేపటి నుండి (ఫిబ్రవరి 28, 2022న ప్రారంభించనుంది. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం మార్చి 4, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఈ గోల్డ్ బాండ్స్ను జారీ చేస్తుంది. సావరీన్ గోల్డ్ బాండ్స్ విక్రయానికి ఆర్బీఐ ప్రత్యేక పోర్టల్ను కూడా ఏర్పాటు చేసింది. గోల్డ్ బాండ్ స్కీం ధరను గ్రాముకు రూ.5109గా నిర్ణయించింది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే చివరి సెషన్లో కాస్త శాంతించాయి.
అలా రూ.500 తక్కువ
గోల్డ్ బాండ్ ధరను రూ.5,109గా నిర్ణయించింది. ఎవరైనా డిజిటల్ మోడ్లో దరఖాస్తు చేసుకుంటే ఒక గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. అంటే పది గ్రాముల బంగారంపై రూ.500 డిస్కౌంట్ వర్తిస్తుంది. డిజిటల్ మోడ్లో దరఖాస్తు చేసుకునే ఇన్వెస్టర్లకు గోల్డ్ బాండ్ రూ.5059కే వర్తిస్తుంది. అంతకుముందు సిరీస్ గోల్డ్ బాండ్ ధర రూ.4,791గా ఉంది. భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని నవంబర్ 2015వ తేదీన కేంద్రం ప్రారంభించింది.
SGB వడ్డీ రేటు
బ్యాంకు ద్వారా లేదా పోస్టాఫీస్ ద్వారా కూడా గోల్డ్ బాండ్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. గోల్డ్ బాండ్స్ పెట్టుబడులకు 2.50 శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. పసిడి బాండ్స్పైన పెట్టుబడిదారులకు సంవత్సరానికి ఇచ్చే 2.50 శాతం వడ్డీ రేటును రెండు దభాలుగా చెల్లిస్తారు. ఇది ఇష్యూ చేసిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తారు. సావరీన్ గోల్డ్ బాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను ఉంటుంది.
వడ్డీ ఆదాయం వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్ను విధించరు. సావరీన్ గోల్డ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలకు పన్ను వర్తించదు. పసిడి దిగుమతులు తగ్గించి ఆర్థిక లోటును అదుపు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.
ధర నిర్ణయం ఇలా
బాండ్ కొనుగోలు చేసిన సమయానికి ముందు ఇండియా బులియన్, జ్యువెల్లరీస్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం 3 రోజుల ధరల సరాసరిని ఆధారంగా తీసుకొని బాండ్స్ను విక్రయిస్తారు. గోల్డ్ బాండ్ ధర భారత కరెన్సీలో నిర్ణయిస్తారు. 1 గ్రాము నుండి కొనుగోలు చేయవచ్చు. ఎనిమిదేళ్లు బాండ్ పీరియడ్ ఉంటుంది. ఐదవ సంవత్సరం తర్వాత నిష్క్రమణకు అవకాశముంది.
మెచ్యూరిటీ ధర అప్పటి ధరపై ఆధారపడి ఉంటుంది.స్టాక్ ఎక్స్చేంజెస్.. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ లేదా నేరుగా ఏజెంట్స్ ద్వారా గోల్డ్ బాండ్స్ను కొనుగోలు చేయవచ్చు. పోస్టాఫీస్, బ్యాంకుల్లోను దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తులు కనీసం ఒక గ్రాము నుండి 4 కిలోల వరకు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు వంటివి అయితే 20 కిలోలు కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్స్ ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. బాండ్స్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎలాంటి మూలధన పన్ను చెల్లించకుండా పూర్తి డబ్బును పొందవచ్చు.