మహిళలూ! వ్యాపారానికి డబ్బులు కావాలా, రూ.50 లక్షల వరకు రుణాలు
దేశంలో మహిళా వ్యాపారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వివిధ రకాల పథకాలను లేదా లోన్లను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఐదు పథకాల ద్వారా మహిళలకు వ్యాపార అవకాశాలు ఉంటాయి. మహిళల కోసం ప్రత్యేకంగా ఉదయనిధి, అన్నపూర్ణ యోజన వంటి ఎన్నో స్కీమ్స్ను తీసుకు వచ్చింది కేంద్రం. దేశంలో మహిళా వ్యాపారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఇప్పటికీ వారి భాగస్వామ్యం ఎనిమిది శాతమే. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకు వచ్చింది.
ఈ పథకం ద్వారా రూ.50వేల రుణం
మహిళల కోసం తీసుకు వచ్చిన పథకాల్లో ముద్ర యోజన, మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్, అన్నపూర్ణ యోజన, స్త్రీ శక్తి ప్యాకేజీ, ఉమెన్ ఎంటర్ప్రైజ్ ఫండ్, మహిళా సమృద్ధి యోజన, సుకన్య సమృద్ధి యోజన, భారతీయ మహిళా బ్యాంకు బిజినెస్ లోన్, మహిళా ఉదయమ్ నిధి స్కీమ్ వంటివి ఉన్నాయి.
అన్నపూర్ణ యోజన పథకం కింద భారత ప్రభుత్వం ఫుడ్ వ్యాపారం కోసం మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.50వేల వరకు రుణాలు అందిస్తుంది. ఈ మొత్తాన్ని పాత్రలు కొనుగోలు చేయడానికి, గ్యాస్ కనెక్షన్ కోసం, ఫ్రిజ్, మిక్చర్, టిఫిన్ బాక్స్, డైనింగ్ టేబుల్ వంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది గ్యారంటీ లేని రుణం. దీనిని 36 నెలల్లో తిరిగి చెల్లించాలి. అన్నపూర్ణ పథకం కింద తీసుకున్న రుణంపై వడ్డీరేటు మార్కెట్ ప్రకారం నిర్ణయిస్తారు. ఈ రుణాన్ని ఎస్బీఐ అందిస్తోంది.
స్త్రీశక్తి ప్యాకేజీ
చిన్న, మధ్య తరహా వ్యాపారం చేసుకోవడానికి ప్యాకేజీ ద్వారా రూ.50 వేల నుండి రూ.2 లక్షల వరకు రుణాలు అందిస్తారు. అయితే ఎంఎస్ఎంఈలో నమోదు చేసుకున్న కంపెనీలకు రూ.25 లక్షల వరకు కూడా రుణాలు వస్తాయి. రూ.5 లక్షల వరకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ రుణం తీసుకోవచ్చు. రూ.20 లక్షలకు మించిన రుణం తీసుకుంటే వడ్డీ రేటులో 0.50 శాతం డిస్కౌంట్ ఉంది.
ముద్ర స్కీంతో రూ.50 లక్షల వరకు
ముద్ర యోజన స్కీం చిన్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినది. ఈ పథకం ద్వారా ఏ జాతీయ బ్యాంకు నుండి అయినా రూ.50వేల నుండి రూ.50 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ నిధుల సహాయంతో మహిళలు బ్యూటీ పార్లర్, ట్యూషన్ సెంటర్, టైలరింగ్ మొదలైన వాటిలో వ్యాపారం ప్రారంభించవచ్చు. రూ.10 లక్షలకు మించి రుణం తీసుకుంటే గ్యారెంటీ అవసరం. ఈ స్కీంలో మూడు ప్లాన్స్ ఉన్నాయి.
శిశు ప్లాన్ అంటే కొత్త వ్యాపారాలకు రూ.50,000 వరకు. కిషోర్ ప్లాన్ అంటే ఇప్పటికే కొనసాగుతున్న వ్యాపారాలకు రూ.50,000 నుండి రూ.5 లక్షల వరకు. తరుణ్ ప్లాన్ అంటే వ్యాపార విస్తరణ కోసం రూ.50,000 నుండి రూ.10 లక్షల వరకు. ముద్ర నేరుగా రుణాలు ఇవ్వదు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల ద్వారా ఈ రుణాలు అందిస్తుంది. రుణగ్రహీతలు ఉద్యమిమిత్ర పోర్టల్ ద్వారా ఆన్ లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉమెన్ ఎంటర్ప్రైజ్ ఫండ్
మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. దీనిని పదేళ్లలోపు చెల్లించాలి. వడ్డీ రేటు మార్కెట్ ఆధారంగా ఉంటాయి. ఈ పథకం కింద బ్యూటీ పార్లర్ తెరవడం, డేకేర్ సెంటర్ నడపడం, ఆటో రిక్షాలు కొనుగోలు చేయడం, బైక్స్, కారు కొనుగోలు చేయడం ఉంటాయి.
మహిళా సమృద్ధి యోజన
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మహిళలను ప్రోత్సహించేందుకు మహిళా సమృద్ధి యోజన స్కీంను ప్రవేశపెట్టారు. వ్యాపారం ప్రారంభించేందుకు అయ్యే ఖర్చుల కోసం బ్యాంకు రూ.60వేల వరకు రుణం ఇస్తుంది. దీనిని మూడేళ్ల ఆరు నెలల్లో చెల్లించాలి. ఇందుకు ప్రతి సంవత్సరం 4 శాతం వడ్డీ చెల్లించాలి. బీపీఎల్ కింద నివసించే మహిళలు ఈ పథకాన్ని పొందవచ్చు. ఇందుకు ఎలాంటి హామీ లేదు. సమీప బ్యాంకును సంప్రదించాలి.
సెంట్ కళ్యాని స్కీమ్
మహిళలు కొత్త వెంచర్ లేదా ప్రణాళిక ఉంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు అందిస్తుంది. సెంట్రల్ బ్యాంకు డీహెచ్ఎస్ స్కీం లోన్ ఇస్తోంది. ఈ స్కీం కింద విలేజ్, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్, సెల్ప్ ఎంప్లాయిమెంట్, అగ్రికల్చరల్ రిటైల్ ట్రేడ్ వంటి వ్యాపారాలు కలిగిన మహిళా ఎంటర్ప్రెన్యూయర్స్ వస్తారు. ఈ పథకం కింద రూ.1 లక్ష రుణం వస్తుంది.
దేనా శక్తి స్కీమ్
అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, మైక్రో లోన్, రిటైల్ స్టోర్స్, మైక్రో ఎంటర్ప్రెన్యూయర్స్ కోసం ఈ రుణం అందిస్తారు. మహిళలకు ఈ స్కీం కింద రూ.20 లక్షల వరకు రుణం అందిస్తారు. వడ్డీ రేటు అతి తక్కువగా 0.25 శాతం. నెలవారీగా ఈ మొత్తాన్ని చెల్లించవచ్చు.
భారతీయ మహిళా బ్యాంకు బిజినెస్ లోన్
ప్రాపర్టీ వెంచర్, రిటైల్ ఎస్ఎంఈ వ్యాపారాలు ప్రారంభించే మహిళల కోసం భారతీయ మహిళా బ్యాంకు బిజినెస్ లోన్ అందుబాటులో ఉంది. మహిళా ఎంటర్ప్రెన్యూయర్స్కు రూ.20 కోట్ల వరకు రుణం అందిస్తారు. 0.25 శాతం రిబెట్ ఉంటుంది. వడ్డీ రేటు 10.15 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు.
మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్ కింద రూ.10 లక్షల వరకు ఆర్థిక మద్దతును అందిస్తోంది.
18 ఏళ్ళ నుండి 45 ఏళ్ళ మహిళల కోసం ఉద్యోగిని స్కీమ్ ఉంది. దీని ద్వారా రూ.1 లక్ష వరకు రుణం అందుతుంది.
సుకన్య సమృద్ధి యోజన స్కీం కింద కూడా ట్యూషన్ సెంటర్, టైలరింగ్ యూనిట్, బ్యూటీ పార్లర్ వంటి వాటి కోసం రుణాలు అందుతాయి. లోన్ మంజూరు చేసే సమయంలోనే ముద్ర కార్డును జారీ చేస్తారు. ముద్రా కార్డు మీకు క్రెడిట్ కార్డు లాగా ఉపయోగపడుతుంది.