సెన్సెక్స్ 60,000కు చేరుకుంటుంది సరే.. భారీ కుదుపు తప్పదా?
భారత స్టాక్ మార్కెట్లు గురువారం అదరగొట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూలతలు, ఫెడ్ రిజర్వ్ ప్రకటనలు, చైనాకు చెందిన ఎవర్ గ్రాండ్ నుండి వచ్చిన ఊరట ప్రకటన, దీనిని గట్టెక్కించేందుకు చైనా బ్యాంకులు ముందుకు రావడం వంటి వివిధ అంశాలు కలిసి వచ్చాయి. దీనికి తోడు దేశవ్యాప్తంగా కరోనా అనంతరం ఇటీవల రియాల్టీ మార్కెట్ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకేరోజులో పెద్ద మొత్తంలో విక్రయాలు జరిపినట్లు వెల్లడించింది. ఇది రియాల్టీ సూచీ పరుగుకు కారణమైంది.
వివిధ నగరాల్లో ఇప్పటికే హౌసింగ్ మార్కెట్, రియాల్టీ మార్కెట్ పుంజుకుందని, మున్ముందు మరింత దూకుడు కనిపిస్తోందని వివిధ రియాల్టీ రంగ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇతర రంగాలు కూడా పుంజుకోవడం సెన్సెక్స్, నిఫ్టీకి కలిసి వచ్చింది. దీంతో సెన్సెక్స్ చివరకు 958.03 (1.63%) పాయింట్లు లాభపడి 59,885.36 పాయింట్ల వద్ద, నిఫ్టీ 276.30 (1.57%) పాయింట్లు ఎగిసి 17,822.95 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
ప్రాఫిట్ బుకింగ్కు అవకాశం
సెన్సెక్స్ నేడు 60,000 పాయింట్లకు 115 పాయింట్ల దూరంలో నిలిచింది. ఓ సమయంలో 59,957 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. రేపు మార్కెట్ ఇలాగే పరుగులు పెడితే ఈ మార్కును దాటేసే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ రేపు భారీగా లాభపడినప్పటికీ సెన్సెక్స్ కనీసం 115 పాయింట్లు లాభపడినా అరవై వేల పాయింట్ల చారిత్రాత్మక మార్కుకు చేరుకుంటుంది.
అయితే నేడు ఇంతగా పరుగులు పెట్టిన నేపథ్యంలో రేపు ప్రాఫిట్ బుకింగ్కు అవకాశం ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా వేస్తున్నారు. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వేగవంతంగా ముందుకు సాగుతుండటం, అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూలతలు వంటి అంశాలు మార్కెట్ దూకుడుకు కారణం. ప్రధానంగా ఫెడ్ రిజర్వ్ ప్రకటన నేపథ్యంలో త్వరలో వడ్డీ రేట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. అయితే ఈ వారానికి రేపు చివరి సెషన్ కాబట్టి ఇంతటి లాభాల్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు పాల్పడవచ్చు. కాబట్టి మార్కెట్లు రేపు కాస్త కిందకు పడిపోవచ్చు.
కుదుపులు..
గత ఏడాది మార్చిలో భారీ పతనం అనంతరం అప్పుడప్పుడు మార్కెట్ ర్యాలీ చేస్తోంది. అలాంటి వాటిలో ఇది ఒకటి. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇది భారీ ర్యాలీ. మార్కెట్ ఇటీవల పరుగులు పెడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సెన్సెక్స్ దాదాపు 12వేల పాయింట్లకు పైగా లాభపడింది. అతి తక్కువ కాలంలో ఇలా జంప్ చేసింది. దీంతో మార్కెట్లో త్వరలో భారీ కరెక్షన్ ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత అనుభవాలు..
ఇదే సమయంలో గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 1992-93, 1994, 1998-2000, 2003-07 కాలంలో మార్కెట్లు పెద్ద ఎత్తున దిద్దుబాటుకు గురయ్యాయని, అప్పుడు ఐదు శాతం నుండి ఇరవై శాతం మధ్య కరెక్షన్కు గురయ్యాయని గుర్తు చేస్తున్నారు. కరోనా తర్వాత కూడా ఒకటిరెండు కుదుపులు వచ్చాయి. బుల్ మార్కెట్ గత పద్దెనిమిది నెలలుగా పైకీ, కిందకు కదులుతున్నాయి.