సరికొత్త గరిష్టాలకు సూచీలు: నెల రోజుల్లో ఈ స్టాక్స్ 20% వరకు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ జంప్ చేశాయి. సూచీలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో నిన్న ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపడంతో నష్టపోయిన మార్కెట్లు నేడు అంతకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్లకు పైగా, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా లాభపడింది. టీసీఎస్, హిందూస్తాన్ యూనీలీవర్ తదితర ఐదు కంపెనీల స్టాక్స్ కేవలం ఒక నెలలోనే సరికొత్త రికార్డుకు చేరుకున్నాయి.
టీసీఎస్, HUL నెల రోజుల్లోనే ఇరవై శాతానికి పైగా లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలతో పాటు విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ వెల్లువెత్తడంతో నేటి ట్రేడింగ్లో బుల్ దూసుకెళ్లింది. కీలక రంగాల్లో కొనుగోళ్లు కూడా సూచీల పరుగుకు కారణమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నేడు సరికొత్త రికార్డును తాకాయి. సెన్సెక్స్ 58,000 పాయింట్ల సమీపానికి చేరుకుంది.
ఆటో బేజారు, ఐటీ, రిలయన్స్ అదుర్స్
సెన్సెక్స్ 57,423.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,892.37 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,287.79 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,095.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,245.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,059.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
సెన్సెక్స్ 514.33 (0.90%) పాయింట్లు లాభపడి 57,852.54 పాయింట్ల వద్ద, నిఫ్టీ 157.90 (0.92%) పాయింట్లు ఎగిసి 17,234.15 పాయింట్ల వద్ద ముగిసింది.
టీసీఎస్, రిలయన్స్ దూకుడు సెన్సెక్స్ సరికొత్త రికార్డుకు ఊతమిచ్చాయి. వొడాఫోన్ ఐడియా ఏకంగా 18 శాతం లాభపడింది.
రిలయన్స్, ఐటీ సూచీలు భారీగా లాభపడ్డాయి.
సెన్సెక్స్ 30 స్టాక్స్లో 21 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.
ఆటో, ఆయిల్, గ్యాస్ రంగాలు మినహా మిగతావి లాభాల్లో ముగిశాయి.
రంగాలవారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ అత్యధికంగా 1.56 శాతం లాభపడింది. ఆటో రంగం అత్యధకంగా 0.25 శాతం నష్టపోయింది.
నెలలో ఈ ఐదు ఇలా అదరగొట్టాయి
ఐటీ రంగం నుండి టీసీఎస్, ఎఫ్ఎంసీజీ నుండి హెచ్యూఎల్, టెలికం నుండి భారతీ ఎయిర్టెల్, సిమెంట్ రంగం నుండి అల్ట్రా టెక్ సిమెంట్, టైటాన్ కంపెనీలు అత్యధికంగా లాభపడటంతో పాటు ఈ కంపెనీల స్టాక్స్ సరికొత్త గరిష్టాన్ని తాకాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 4.2 శాతం లాభపడగా, ఎస్ అండ్ పీ బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం నుండి 1 శాతం లోపు లాభపడింది. HUL, TCS, బజాజ్ ఫైనాన్స్ సూచీలు గత నెల రోజుల్లో 20 శాతం నుండి 21 శాతం మేర లాభపడ్డాయి. అదే సమయంలో ఇతర 11 స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్ సర్వ్, HDFC బ్యాంకు, HCL టెక్నాలజీస్, నెస్ట్లే ఇండియాలు 10 శాతం వరకు ఎగిశాయి.
టీసీఎస్ షేర్ ధర రూ.3,828కి చేరుకుంది. బలమైన డిమాండ్, క్లౌడ్ కంప్యూటింగ్ అడాప్షన్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అవకాశాలు ఈ షేర్ ధర పెరుగుదలకు కారణాలు.
టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, HDFC లైఫ్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్ 6.48, HDFC లైఫ్ 5.63, సిప్లా 3.51, టీసీఎస్ 3.28, HUL 2.49 లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 2.27, కోల్ ఇండియా 1.80, బజాజ్ ఆటో 0.99, ఓఎన్జీసీ 0.88, దివిస్ ల్యాబ్స్ 0.71 ఉన్నాయి.