మళ్లీ పతనం.. సెన్సెక్స్ 677 పాయింట్లు డౌన్: ఈ స్టాక్స్ మాత్రం 10% జంప్
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీగా నష్టపోయాయి. మార్కెట్లు ఈ వారం మొదటి రెండు రోజులు లాభాల్లో ముగిశాయి. మూడో రోజు బుధవారం నుండి నష్టాల్లోకి జారుకున్నాయి. మొన్న 206 పాయింట్లు, నిన్న 1158 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ నేడు 677 పాయింట్లు క్షీణించింది. మూడు రోజుల్లోనే 2000 పాయింట్లకు పైగా పడిపోయింది. ఈ వారంలో సెన్సెక్స్ 1200 పాయింట్ల వరకు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు సూచీలను దెబ్బతీస్తున్నాయి. అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్ట్ గడువు ముగింపు నేపథ్యంలో నిన్నటి నుండి ఇన్వెస్టర్ల అప్రమత్తతతో సూచీలు పడిపోయాయి.
గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలత నేపథ్యంలో నిఫ్టీ కీలక మద్దతును కోల్పోయింది. ద్రవ్యోల్భణం పెరుగుతుండటంతో విధానం కఠినతరం అవుతుందనే అంచనాలతో ఇటీవల యూరోపియన్ మార్కెట్లు పతనమయ్యాయి. కోవిడ్ ఇన్ఫెక్షన్ యొక్క కొత్త కేసుల పెరుగుదల కూడా మార్కెట్ ప్రతికూలతకు మరింత తోడయిందని చెబుతున్నారు. FIIల నిరంతర విక్రయం మార్కెట్ భారీ కరెక్షన్కు తోడవుతోంది.
కీలక మద్దతుస్థాయిలో క్లోజ్
మార్కెట్లు నేడు కీలక మద్దతు స్థాయిలో ముగిశాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చేవారం 17550-17500 బ్రేక్ చేస్తే మాత్రం నిఫ్టీ 17200 స్థాయికి పడిపోవచ్చునని అంచనా వేస్తున్నారు. లేదంటే మరింత ముందుకు సాగుతుందని, 17900 వద్ద బలమైన నిరోధకం ఉందని చెబుతున్నారు. 17500 నుండి 17600 మధ్య బలమైన మద్దతు కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం 17800 నుండి 17900కు పరుగు తీయవచ్చునని చెబుతున్నారు. అయితే 17500 దిగువకు పడిపోతే మాత్రం మరింత పతనమవుతుందని చెబుతున్నారు.
టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్ 2.54 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.95 శాతం, శ్రీ సిమెంట్స్ 1.57 శాతం, మారుతీ సుజుకీ 1.53 శాతం, సిప్లా 1.49 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టెక్ మహీంద్రా 3.62 శాతం, NTPC 3.42 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 3.21 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 3.04 శాతం, లార్సన్ 2.62 శాతం నష్టపోయాయి.
మార్కెట్ నష్టాలు
సెన్సెక్స్ నేడు 59,857.33 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,132.81 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,089.37 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు వెయ్యి పాయింట్లకు పైగా పైకి కిందకు కదలాడింది. నిఫ్టీ 17,833.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,915.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,613.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 677.77 (-1.13%) పాయింట్లు నష్టపోయి 59,306.93 పాయింట్ల వద్ద, 185.60 (1.04%) పాయింట్లు నష్టపోయి 17,671.65 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ స్టాక్స్ అదుర్స్
మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లినప్పటికీ పలు స్టాక్స్ 10 శాతం లాభపడ్డాయి. పంచమహల్ స్టీల్(12.47%), గాయత్రీ ప్రాజెక్ట్స్(12.14%), ఇసాబ్ ఇండియా(11.69%), ఎలెకాన్ ఇంజినీరింగ్ కంపెనీ(11.53%), భారత్ బిజ్లీ (11.06%), ఆల్ సెక్ టెక్ (10.38%), ఓరియంటల్ ట్రైమెక్స్(10.33%), కౌంటుమ్ పేపర్స్ (10.06%), పౌషక్ లిమిటెడ్ (10.0%), MRC ఎగ్జిమ్ (10.0%) లాభపడ్డాయి.