లాభాల నుండి నష్టాల్లోకి మార్కెట్లు: ఈ స్టాక్స్ ఏడాదిలో భారీ రిటర్న్స్
రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్లు గతవారంలో తొలి సెషన్ మినహా మిగతా నాలుగు సెషన్లలో నష్టపోయాయి. అయితే ఈ వారం లాభాలతో ప్రారంభమైన సూచీలు, వరుసగా రెండు రోజులు పరుగు తీశాయి. కానీ నేడు (అక్టోబర్ 27, బుధవారం) మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. రంగాలవారీగా చూస్తే మెటల్, ఇన్ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఆటో సూచీలు నష్టపోయాయి. పీఎస్యూ బ్యాంకు, ఫార్మా, ఐటీ, రియాల్టీ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీల ప్లాట్గా ముగిశాయి. ప్రధానంగా నిఫ్టీ బ్యాంకు, మెటల్స్ సూచీలను కిందకు లాగాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, సాయంత్రానికి నష్టపోయాయి.
లాభాల నుండి నష్టాల్లోకి..
సెన్సెక్స్ ఉదయం 61,499.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,576.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,989.39 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,295.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,342.05 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,167.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నిన్న 61,350 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 150 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఉదయం ఓ సమయంలో కాసేపు నష్టాల్లోకి వెళ్లినప్పటికీ, మళ్లీ కోలుకుంది.
మధ్యాహ్నం గం.2.30 వరకు లాభాల్లోనే కొనసాగింది. కానీ అంతలోనే కిందకు పడిపోయింది. అంతకంతకూ దిగజారిన సెన్సెక్స్ చివరకు 206 పాయింట్ల నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 206.93 (0.34%) నష్టపోయి 61,143.33 పాయింట్ల వద్ద, నిఫ్టీ 57.45 (0.31%) పాయింట్లు దిగజారి 18,210.95 పాయింట్ల వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 4.20 శాతం, UPL 3.96 శాతం, దివిస్ ల్యాబ్స్ 2.60 శాతం, సిప్లా 1.65 శాతం, ఇన్ఫోసిస్ 1.48 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు 6.46 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.75 శాతం, ఓఎన్జీసీ 3.19 శాతం, టాటా మోటార్స్ 2.11 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.86 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, టాటా మోటార్స్ ఉన్నాయి.
ఈ స్టాక్స్ ఏడాదిలో అదుర్స్
నేడు బ్యాంకింగ్ స్టాక్స్ అదరగొట్టాయి. ఎస్బీఐ షేర్ ధర 1 శాతం పెరిగి రూ.518 వద్ద ముగిసింది. ఇటీవల బ్యాంకింగ్ స్టాక్స్ భారీగా లాభపడుతున్నాయి. PSU బ్యాంకులు గత ఏడాది కాలంలోనే దాదాపు రెండు వందల శాతం రిటర్న్స్ ఇచ్చాయి. నిఫ్టీ పీఎస్ఈ ఇండెక్స్ గత అయిదేళ్ల కాలంలో మొదటిసారి మంచి ప్రదర్శన చేసింది. నిఫ్టీ పీఎస్ఈ ఇండెక్స్ ఏడాది కాలంలో 83 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అదే సమయంలో నిఫ్టీ 50 ఇండెక్స్ 55 శాతం రిటర్న్స్ ఇచ్చింది. 2021లో పీఎస్ఈ ఇండెక్స్ 50 శాతం లాభపడగా, నిఫ్టీ 30 శాతం ఎగిసింది.
2020, 2019, 2018లో నిఫ్టీ పీఎస్ఈ వరుసగా 13 శాతం, 5 శాతం, 21 శాతం నష్టపోయాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ మాత్రం వరుసగా 15 శాతం, 11 శాతం, 3 శాతం నష్టపోయింది.