గరిష్టం నుండి 2500 పాయింట్లు డౌన్: స్టాక్ కొనుగోలుకు వేచి చూడవద్దు!!
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడు రోజులు నష్టపోయాయి. నేడు (నవంబర్ 19, శుక్రవారం) గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు రోజు. క్రితం సెషన్లో సెన్సెక్స్ 372 పాయింట్లు క్షీణించి 59,636 పాయింట్ల వద్ద, నిఫ్టీ 133 పాయింట్లు నష్టపోయి 17,764.80 పాయింట్ల వద్ద సెటిల్ అయింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. మార్చి 2020లో 26,000 దిగువ నుండి వేగంగా కోలుకోవడంతో ఇప్పుడు రూ.62,000 దాటి 63,000 దిశగా పరుగు పెట్టింది. అయితే ద్రవ్యోల్భణ ఆందోళనలు, యూరోప్లోని పలు ప్రాంతాల్లో కరోనా మళ్లీ వెలుగుచూడటం జాతీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పైన ప్రభావం చూపింది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లు ముందుకు సాగుతాయా, నిలకడగా ఉంటాయా, మరింత దిద్దుబాటుకు గురవుతాయా అనే ప్రశ్న చాలామందిలో ఉంది.
2013 కంటే నెంబర్స్ బెట్టర్
ప్రస్తుతం భారత్ 2013లోని ప్రమాదకర పరిస్థితిలో లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇప్పుడు టేపర్ ఫాలవుట్ను నిర్వహించే మెరుగైన స్థితిలో కనిపిస్తోందని చెబుతున్నారు. దేశీయ విదేశీ మారకపు నిల్వలు 640 బిలియన్ డాలర్లతో రికార్డ్ గరిష్టాన్ని చేరుకుంది. 2013తో పోలిస్తే ఇది రెండింతలు కావడం గమనార్హం. జీడీపీ, కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ సానుకూలంగా కనిపిస్తున్నాయి. 2013తో పోలిస్తే పలు నెంబర్స్ సానుకూలంగా ఉన్నాయని అంటున్నారు.
స్టాక్స్ కొనుగోలు చేయవచ్చు
ప్రస్తుతం స్టాక్స్ కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. మరింత డిప్ వరకు వేచి చూడటం సరికాదని అంటున్నారు. వచ్చే వారం స్టాక్ మార్కెట్లు కాస్త ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని, మరింతగా క్షీణించే అవకాశాలు తక్కువ అంటున్నారు. కాబట్టి మరింత డిప్ కోసం వేచి చూడకుండా కొనుగోలు చేయవచ్చునని అంటున్నారు.
వివిధ పెట్టుబడి సాధనాల్లో
టాటా మోటార్స్ షేర్ రెండు నెలల క్రితం వరకు రూ.300 వద్ద ఉందని, ఇప్పుడు రూ.500 స్థాయిని దాటిందని మార్కెట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో గత ఏడాది ఇదే సమయంలో బంగారంపై రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, ప్రస్తుతం దాదాపు స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం పసిడి దాదాపు ఏడాది క్రితం ఉన్న ధర వద్ద ఉంది. అదే సమయంలో ఈ ఏడాది జనవరిలో ఇన్వెస్ట్ చేసి ఉంటే మాత్రం నష్టపోయినట్లే. అందుకే ఎప్పుడైనా మన పెట్టుబడి మొత్తాన్ని డైవర్సిఫై చేయాలి. బంగారం, స్టాక్స్.. ఇలా వివిధ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి.