దిద్దుబాటు ఉంటుందా, మార్కెట్ జోరు ఇలాగే కొనసాగుతుందా?
ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా మార్కెట్ జోరు పైన బుల్లిష్గా ఉన్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 24) సెన్సెక్స్ 60,000 పాయింట్లను దాటి ముగిసింది. ఈ వారం మార్కెట్లు పరుగులు పెట్టాయి. రెండు రోజుల క్రితం సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్ల మేర లాభపడింది. మొన్న 958 పాయింట్లు, నిన్న 160 పాయింట్ల మేర సెన్సెక్స్ ఎగిసిపడింది. అంటే రెండు రోజుల్లోనే 1100 పాయింట్లకు పైగా పెరిగింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరిగింది. వీటి మార్కెట్ క్యాప్ రూ.2,61,18,539.92 కోట్లకు చేరుకుంది. సూచీ వరుసగా పరుగు పెడుతున్న నేపథ్యంలో ఎప్పుడైనా కరెక్షన్కు గురికావొచ్చుననే వాదనలు ఉన్నాయి. అసలు మొన్న వెయ్యి పాయింట్లు లాభపడటం, నిన్న వారాంతం కావడంతో నిన్ననే ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుందని భావించారు. కానీ అలా జరగలేదు. అంతర్జాతీయ మార్కెట్ సానుకూలతలు, కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం, చైనా ఎవర్ గ్రాండ్ సానుకూల ప్రకటన అంశాలు సానుకూల వారాంత ముగింపుకు దోహదపడ్డాయి.

మార్కెట్ దూకుడుకు కారణాలు
రెండు రోజుల క్రితం సెన్సెక్స్ 60,000 పాయింట్లకు చేరువలో ఉన్న సమయంలో వారంతం కాబట్టి మార్కెట్లు ప్రాఫిట్ బుకింగ్కు లోను కావొచ్చునని భావించారు. గురువారం సెన్సెక్స్ 958 పాయింట్ల లాభంతో పరుగులు తీసింది. అరవై వేల పాయింట్లు చారిత్రాత్మక మార్కు. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వేగవంతం, అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూలతలు వంటి అంశాలు వరుసగా మార్కెట్ దూకుడుకు కారణమయ్యాయి. ప్రధానంగా ఫెడ్ రిజర్వ్ బాండ్స్ కొనుగోలు నవంబర్ నుండి తగ్గిస్తామని ప్రకటించడంతో త్వరలో వడ్డీ రేట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ ముద్రణ, రాయితీ ప్రకటన, పీఎల్ఐ స్కీం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ ప్రభావం వారాంతంలో మార్కెట్ దూకుడుకు కలిసి వచ్చింది.

దిద్దుబాటు... సమయం తీసుకుంటుందా?
అయితే ఎప్పుడైనా మార్కెట్ కరెక్షన్కు గురి కావొచ్చునని మార్కెట్ నిపుణులు అంటున్నారు. సూచీలు, షేర్లు భారీగా పెరిగిన కారణంగా దిద్దుబాటుకు అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ప్రస్తుతం షేర్లు వాటి వాస్తవిక ధరల కంటే చాలా ఎక్కువ రేటులో ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాఫిట్ బుకింగ్ లేదా అంతర్జాతీయ అననుకూల పరిణామాలు.. ఇలా ఏం జరిగినా మార్కెట్లు కుప్పకూలే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్భణం, వడ్డీ రేట్లు, క్రూడ్ ధరలు పెరగడం, స్టాక్ మార్కెట్కు ఇబ్బందికర పరిణామాలు. ఈ వారం ప్రారంభంలో చైనా ఎవర్ గ్రాండ్ ఇష్యూ వణికించినప్పటికీ, ఆ తర్వాత ఊరటనిచ్చింది. ప్రస్తుతం అమెరికాలో టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ పైన వడ్డీ రేటు 1.41 శాతంగా ఉంది. ఇది రెండు శాతానికి మించితే స్టాక్ మార్కెట్ నష్టపోవచ్చునని అంచనా. ఇన్వెస్టర్లు ఈ అంశానికి సంబందించి ఆచితూచి వ్యవహరించాలని నిపుణుల సూచన. అదే సమయంలో మరింతకాలం మార్కెట్ దూకుడు కొనసాగే అవకాశాలు ఉన్నాయని, థర్డ్ వేవ్ ఆందోళనలు కూడా దాదాపు ముగిసిపోయాయని, కాబట్టి కరెక్షన్కు కాస్త సమయం ఉందనే వారు కూడా లేకపోలేదు. కార్పోరేట్ సంస్థలకు ప్రస్తుతం రుణభారం తక్కువగా ఉంది. ఎన్పీఏలను తట్టుకొని బ్యాంకింగ్ రంగం నిలబడింది. బ్యాడ్ బ్యాంక్ ప్రక్రియ బ్యాంకులకు అతి పెద్ద ఊరట. ఈ అంశాలు మార్కెట్కు అదనపు సానుకూల అంశాలు.

పెట్టుబడుల వరద
కరోనా తర్వాత మార్కెట్లోకి రిటైల్ పెట్టుబడుల వరద పారుతోంది. ప్రతిరోజు ఎక్స్చేంజీల్లో నమోదయ్యే ట్రేడింగ్ టర్నోవర్లో రిటైలర్ల వాటా రెండేళ్ల క్రితం 39 శాతం కాగా, కరోనా తర్వాత 45 శాతానికి చేరుకుంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications