లాభాల్లో ముగిసిన మార్కెట్లు: ఈ స్టాక్స్ అదుర్స్, ఆరేళ్ల క్రితం రూ.100, ఇప్పుడు రూ.1000
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న 553 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ నేడు (మంగళవారం, అక్టోబర్ 5) 445 పాయింట్లకు పైగా ఎగిసింది. ఈ రెండు రోజుల్లో దాదాపు వెయ్యి పాయింట్లు ఎగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల కారణంగా ఉదయం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నం వరకు అలాగే ఉన్నాయి. మధ్యాహ్నం గం.12.45 తర్వాత ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కావడంతో సూచీలు పుంజుకున్నాయి.
అదే సమయంలో గతవారపు గరిష్ఠాల నుండి సూచీలు కిందకు రావడాన్ని అవకాశంగా భావించిన ఇన్వెస్టర్లు కొన్ని కీలక రంగాల్లో కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. దేశీయంగా రెండో క్వార్టర్ ఫలితాలు రానుండటంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఉన్నారు. ఈ పరిణామాలతో నేడు సూచీలు ఉదయం నష్టాల నుండి కోలుకొని, భారీ లాభాల్లోకి ముగిశాయి.
నష్టాల నుండి లాభాల్లోకి
సెన్సెక్స్ ఉదయం 59,320.14 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,778.87 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,127.04 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,661.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,833.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,640.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 445.56 (0.75%) పాయింట్లు లాభపడి 59,744.88 పాయింట్ల వద్ద, నిఫ్టీ +131.05 (0.74%) పాయింట్లు ఎగిసి 17,822.30 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 13 పైసలు క్షీణించి 74.44 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో మెజార్టీ షేర్లు లాభపడ్డాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ONGC - 10.87 శాతం, IndusInd Bank - 4.36 శాతం, Coal India 4.21 శాతం, IOC 2.89 శాతం, Bharti Airtel 2.62 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో Cipla 2.40 శాతం, Hindalco 2.06 శాతం, Shree Cements 1.79 శాతం, TATA Cons. Prod 1.58 శాతం, Sun Pharma 1.38 శాతం నష్టపోయాయి.
ఈ స్టాక్స్ అదుర్స్
గతవారం సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా నష్టపోయింది. కానీ ఈ రెండు రోజుల్లో దాదాపు వెయ్యి పాయింట్లు లాభపడింది. దీంతో ఆల్ టైమ్ గరిష్టం 60,000 పాయింట్లకు సమీపంలో ఉంది. నేటి ట్రేడింగ్లో ఈ స్టాక్స్ దాదాపు పదిహేను శాతం, అంతకుమించి లాభపడ్డాయి. GM బ్రీవరీస్(20.0%), IFL ఎంటర్ప్రైజెస్(20.0%), శివ టెక్స్ యార్న్(19.99%), అర్వింద్ ఫ్యాషన్(19.99%), TCM లిమిటెడ్ (19.97%), పటేల్ ఇంజినీరింగ్(19.96%), IG పెట్రోకెమ్(19.88%), హిమాలయ ఫుడ్ ఇంటర్(19.74%), GG దండేకర్ (19.63%), ప్లాటినమ్ వన్ బిజనెస్ సర్వీసెస్ లిమిటెడ్.(19.61%) ఉన్నాయి. నిఫ్టీ 50 షేర్ ఇండెక్స్లో 30 స్టాక్స్ లాభాల్లో, 20 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
ఆరేళ్లలో రూ.100 నుండి రూ.1000
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఫార్మా స్టాక్స్ ఇటీవల భారీగా లాభపడ్డాయి. కొన్ని స్టాక్స్ సరికొత్త గరిష్టాలను తాకాయి. ఈ రెండేళ్ల కాలంలో భారీగా లాభపడిన రంగాలను పరిశీలిస్తే ఐటీ, ఫార్మా రంగాలు ఉన్నాయి. అయితే ఇటీవల స్వల్పంగా నష్టాల్లో ఉన్నాయి. అయితే ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఆరేళ్ల కాలంలో పదిరెట్ల లాభాలను అందించింది. ఆ స్టాక్ ఆర్తి ఇండస్ట్రీస్. అరేళ్ల క్రితం ఇందులో రూ.100 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.1000 వస్తుంది. ఈ స్టాక్ నిన్న నాలుగు అంకెలకు చేరుకుంది. ఆర్తి ఇండస్ట్రీస్ షేర్ నేడు 43.05 (4.22%) లాభపడి రూ.1,064.40 వద్ద ముగిసింది. 2015 దాదాపు ఇదే కాలంలో ఈ స్టాక్ ధర రూ.100కు కాస్త పైన ఉంది.
కరోనాకు ముందు రూ.500కు పైన పలికిన ఈ స్టాక్, కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చిలో మార్కెట్లు కుప్పకూలినప్పుడు రూ.400 దిగువకు పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. ఏడాదిలో 109 శాతం, 2021 క్యాలెండర్ ఏడాదిలో 69 శాతం, 6 నెలల్లో 57 శాతం లాభపడింది.