రెండ్రోజుల్లో 1800 పాయింట్లు జంప్, మార్కెట్ ర్యాలీ కొనసాగుతుందా?
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత అంతకంతకూ పైకి ఎగిశాయి. ఏ సమయంలోను కిందకు పడిపోలేదు. క్రితం సెషన్లో సెన్సెక్స్ 53,424 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఓ సమయంలో అతి స్వల్పంగా నష్టపోయి 53,367 పాయింట్లకు పడిపోయినప్పటికీ అది కాసేపు మాత్రమే. మార్కెట్లు రోజంతా లాభాల్లోనే తేలియాడాయి. నిన్న 500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్, నేడు1200 పాయింట్లకు పైగా ఎగిసింది. రెండు రోజుల్లోనే దాదాపు 1800 పాయింట్లు జంప్ చేసింది. అంతకుముందు నాలుగు రోజుల పాటు నష్టపోయిన మార్కెట్లు, వరుసగా రెండో రోజు లాభపడింది.
2 శాతానికి పైగా జంప్
సెన్సెక్స్ నేడు 53,793 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,893 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,367 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 1223 పాయింట్లు లేదా 2.30 శాతం ఎగిసి 54,647 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 16,078 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,418 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,990 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 331 పాయింట్లు లేదా 2.07 శాతం ఎగిసి 16,345 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ రెండు రోజుల్లో 1800 పాయింట్ల వరకు లాభపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 5 శాతానికి పైగా ఎగిసింది.
ఉక్రెయిన్ ప్రకటన సహా కారణాలివే
నాలుగు రోజుల పాటు భారీ నష్టాల్లో కూరుకుపోయిన మార్కెట్లు నిన్న కాస్త తేరుకున్నాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటన కూడా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది. రష్యాతో నాటో యుద్ధం చేయదని, నాటో సభ్యత్వం తీసుకోబోమని, నాటో తమను చేర్చుకోవడానికి సిద్ధంగా లేదని జెలెన్స్కీ ప్రకటించారు.
రష్యా ప్రధాన డిమాండ్లలో ఇదే మొదటిది. కాబట్టి సూచీలు కాస్త సానుకూలంగా కదలాడాయి.
రష్యా నుండి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే ఐరోపా దేశాలు మాత్రం కలిసి రాలేదు. చమురు ధరలు మరింత పెరగకుండా ఐరోపా దేశాల నిర్ణయం ఉంది. ఇది రిటైల్ ధరలపై ప్రభావం చూపుతుంది.
మరోవైపు, మార్చి 27 నుండి విమాన సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎక్కువగా ఎన్డీయే గెలుచుకుంటుందనే సర్వే ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి.అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును వేగవంతం చేసే ఉద్దేశ్యంతో ఉంది.ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపారు.
దూకుడు కొనసాగుతుందా?
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతే మార్కెట్ పరుగు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఉక్రెయిన్ అధినేత ప్రకటన మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. ఉక్రెయిన్ ప్రకటన తర్వాత రష్యా యుద్ధాన్ని ఆపివేస్తే మార్కెట్లు మరింత పుంజుకునే అవకాశాలు ఉంటాయి. నాటోలో చేరమని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే రెండింటిని స్వతంత్రంగా గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. దీనిపై మాస్కో పట్టుబడితే పరిస్థితి మరోలా ఉంటుంది.