డెబిట్ కార్డు ఫ్రాడ్, ఇలా చేయకండి: ఎస్బీఐ హెచ్చరిక
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్న విధంగానే ప్రాడ్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ అన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. గుర్తు తెలియని ఫోన్లు, సందేశాలు, లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటికి స్పందించకూడదని చెబుతుంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు కొన్ని చిట్కాలు సూచిస్తూ ట్వీట్ చేసింది. మీ ఏటీఎం కార్డు, పిన్ చాలా ముఖ్యమైనవని, మీ డబ్బును సురక్షితంగా, భద్రంగా ఉంచేందుకు ఈ చిట్కాలు పాటించాలని సూచించింది.
ఇలా చేయకండి
ఏటీఎంలలో సురక్షిత బ్యాంకింగ్ గురించి చిట్కాలు పాటించాలంటూ కొన్ని సూచనలు చేసింది ఎస్బీఐ. ఏటీఎం లేదా పీవోఎస్ మెషీన్ వద్ద కార్డును ఉపయోగిస్తున్నప్పుడు కీ-ప్యాడ్ను చేతితో మూసివేయాలని పేర్కొంది.
మీ పిన్ లేదా కార్డు వివరాలను ఎప్పుడు కూడా ఎవరితోను పంచుకోవద్దని తెలిపింది.
మీ కార్డులో ఎప్పుడు కూడా పిన్ నెంబర్ రాయవద్దని సూచించింది.
కార్డ వివరాలు లేదా పిన్ నెంబర్ అడిగే సందేశాలు, ఈ-మెయిల్స్, కాల్స్కు స్పందించవద్దని కోరింది.
వీటి పట్ల జాగ్రత్త
మీ పుట్టిన రోజు, ఫోన్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ను మీ పిన్ నెంబర్గా పెట్టుకోవద్దని తెలిపింది. ట్రాన్సాక్షన్ చేసిన రిసిప్ట్ను ఎక్కడ పడితే అక్కడ పారవేయవద్దని, దానిని కస్టమర్లు తమ వద్దే సురక్షితంగా పెట్టుకోవాలని తెలిపింది. ట్రాన్సాక్షన్కు ముందు సీసీ కెమెరాను పరిశీలించమని సూచన చేసింది. ఏటీఎం లేదా పీవోఎస్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కీప్యాడ్ మానిప్యులేషన్, హీట్ మ్యాపింగ్ గురించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
ఇలా చేయకండి
మీరు ట్రాన్సాక్షన్స్ నిర్వహించే సమయంలో మీ వెనుక ఇతరులు నిలబడి పిన్ నెంబర్ చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఇదిలా ఉండగా, ఎస్బీఐ ఏటీఎంలలో ట్రాన్సాక్షన్స్ మరింత సురక్షితంగా ఉండేందుకు జనవరి 1వ నుండి వన్ టైమ్ పాస్ వర్డ్ సహాయంతో నగదు ఉపసంహరించుకునే వీలు కల్పించిన విషయం తెలిసిందే.