ఎస్బీఐ కార్డ్ పండుగ ఆఫర్లు: క్యాష్ బ్యాక్, డిస్కౌంట్..
ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ కార్డు పండుగ ఆఫర్లను ప్రకటించింది. వివిధ రకాల బ్రాండ్ల ఉత్పత్తుల కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్, రాయితీలను ప్రకటించింది. ఈ నెల 1వ తేదీ నుండి మొదలైన ఈ ఆఫర్లు వచ్చే నెల 15వ తేదీ వరకు అమలులో ఉంటాయని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా రెండువేల నగరాలు, పట్టణాల్లో వెయ్యికి పైగా ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఎస్బీఐ కార్డ్స్ తెలిపింది.
రివార్డ్ షాపింగ్ అనుభవాలతో కొనుగోలుదారులు ఈ పండుగ సీజన్లో కొత్త ఉత్సాహం పొందగలరని ఆశాభావం వ్యక్తం చేసింది. జాతీయ, స్థానిక వ్యాపారులకు ఇది లాభించగలదని పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్ కొనుగోళ్లపై ఈఎంఐలకు అదనపు ఛార్జీలు ఉండవని తెలిపారు. ఈపండుగ ఆఫర్లు అక్టోబర్ 1వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు ఉంటాయి.
పండుగ సీజన్ నేపథ్యంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు తమ కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆటో, పర్సనల్, గోల్డ్ హోమ్, పర్సనల్ లోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించాయి. ప్రాసెసింగ్ ఫీజును కొన్ని బ్యాంకులు జీరోకు తగ్గించాయి. పండుగ సమయంలో డిమాండ్ పెంచే ఉద్దేశ్యంలో భాగంగా ఆఫర్లు ప్రకటించారు.