రేపటి నుండి ఎస్బీఐ క్యాష్ ఉపసంహరణ, నిబంధనల మార్పు
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1 గురువారం నుండి కొత్త ఛార్జీలను అమలులోకి తెస్తోంది. పరిమితికి మించి నగదు ఉపంసహరణ మొదలు చెక్కు బుక్స్, బేసిక్ సేవింగ్స్ డిపాజిట్(BSBD) ఖాతాదారులకు అదనపు చెల్లింపులు తప్పనిసరి. ఇందుకు రూ.15 నుండి రూ.75 వరకు వసూలు చేయనున్నారు. దీనికి జీఎస్టీ అదనం. BSBD ఖాతాల ఛార్జీలను ఎస్బీఐ రేపటి నుండి సవరిస్తోంది. వీరి ఉచిత నగదు ఉపసంహరణ సదుపాయాన్ని నెలకు నాలుగుకు పరిమితం చేస్తుంది.
చెక్కుబుక్కు ఉపయోగిస్తే...
BSBD ఖాతాదారులకు ప్రస్తుతం ఏడాదికి 10 లీవ్స్ ఉండే ఒక చెక్కుబుక్ ఎస్బీఐ ఉచితంగా జారీ చేస్తోంది. జూలై 1వ తేదీ నుండి ఆ పరిమితి మించితే 10 లీవ్స్ చెక్కుబుక్కుకు రూ.40 ప్లస్ జీఎస్టీ అదనం. 25 లీవ్స్ చెక్కుబుక్కుకు రూ.75 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అత్యవసరంగా 10 లీవ్స్ చెక్కుబుక్కు కావాలంటే BSBD ఖాతాదారులు రూ.50 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. అయితే సీనియర్ సిటిజన్లను ఈ అదనపు చెక్కుబుక్ ఛార్జీల నుండి మినహాయింపు ఇస్తుంది.
ఏటీఎం ఉపసంహరణ
BSBD ఖాతాదారులు ఏటీఎంల నుండి నెలకు నాలుగుసార్లు కంటే ఎక్కువ నగదును ఉపసంహరిస్తే ఒక్కో ట్రాన్సాక్షన్స్ పైన రూ.15 చెల్లించాలి. ఎస్బీఐ శాఖల్లో నగదు ఉపసంహరణ చేసినా ఛార్జీ వర్తిస్తుంది. అయితే బ్రాంచీల్లో, ఏటీఎం, సీడీఎంలలో నాన్-ఫైనాన్షియల్, ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ ఉచితం.
మరిన్ని మార్పులు
జూలై ఒకటో తేదీ నుండి పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎస్బీఐ చెక్కు బుక్కు, ఏటీఎం నగదు ఉపసంహరణతో పాటు మరిన్ని మార్పులు ఉండనున్నాయి. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు విలీనం నేపథ్యంలో కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్ వర్తిస్తుంది. ట్రాన్సాక్షన్స్ సజావుగా జరిగేలా కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్ పొందాలని సిండికేట్ బ్యాంకు తన ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది.