Samvat 2077: 12 ఏళ్లలోనే తొలిసారి మార్కెట్ భారీ జంప్
సంవత్ 2077కు స్టాక్ మార్కెట్లు భారీగా ఎగిశాయి. దీపావళి నుండి దీపావళి వరకు చూస్తే సెన్సెక్స్ ఏకంగా 16,134 పాయింట్లు, నిఫ్టీ 5,049 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ 38 శాతం వరకు, నిఫ్టీ 41 శాతం వరకు ఎగిసింది. అమెరికా ఫెడ్ సమావేశం నేపథ్యంలో వరుసగా రెండో రోజు సూచీలు లాభపడ్డాయి. వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. డాలర్ మారకంతో రూపాయి 22 పైసలు పెరిగి నెల గరిష్టం 74.46 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు నష్టపోయాయి. కరోనా కారణంగా సెన్సెక్స్ గత ఏడాది మార్చి నెలలో 26,000 దిగువకు పడిపోయింది. అయితే ఆర్థిక రికవరీ నేపథ్యంలో సూచీలు క్రమంగా పుంజుకున్నాయి. దీంతో గత ఏడాది దీపావళి నుండి ఈ ఏడాది దీపావళి వరకు సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు నలభై శాతం మేర లాభపడ్డాయి.
సంవత్ 2077లో ఈక్విటీ మార్కెట్లు గత 12 సంవత్సరాలలోనే భారీ లాభాలను నమోదు చేశాయి. ఈ కాలంలో ఎస్ అండ్ పీ బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీలు 83 శాతం లాభపడ్డాయి. ఎస్ అండ్ పీ బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 63 శాతం ఎగిసింది. సంవత్ 2065లో సూచీలు ఏకంగా 104 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 40 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 71 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ 82 శాతం లాభపడ్డాయి. కరోనా నుండి వేగంగా కోలుకొని, ఆర్థిక రికవరీ కనిపించింది. దీంతో మార్కెట్లు కూడా లాభపడ్డాయి.
దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు నేడు గంటపాటు ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్ ముగుస్తుంది. దీపావళి బలిప్రతిపద సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు.