నిన్న బంగారం, నేడు ఇళ్ల కొనుగోలుకు ఇన్వెస్టర్ల మొగ్గు: సొంతం కోసం.. ఆ తర్వాతే పెట్టుబడి
రియాల్టీలో పెట్టుబడులు సురక్షిత మార్గంగా చాలామంది భావిస్తున్నారు. 2020 మార్చి-ఏప్రిల్ నెలల్లో లాక్ డౌన్కు ముందు రియాల్టీ రంగం మంచి ఆదరణ పొందింది. కరోనా కారణంగా గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉంది. ఇటీవలి కాలంలో క్రమంగా తిరిగి పూర్వస్థితికి చేరుకుంటోంది. మహమ్మారి నేపథ్యంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. దీంతో చాలామంది అదనపు గదులతో కూడిన పెద్ద ఇంటి నిర్మాణాలకు మొగ్గు చూపుతున్నారు. ఎప్పటికప్పుడు ఇంటి ప్రాధాన్యం మారిపోతోంది. చాలామంది ఇప్పుడు ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు అనరాక్ సర్వేలో వెల్లడైంది.
రియాల్టీ, స్టాక్ మార్కెట్
సీఐఐ-అనరాస్ కోవిడ్ 19 సెంటిమెంట్ పేరుతో ఈ సర్వే నిర్వహించారు. ఖర్చు ఎక్కువగా అయినప్పటికీ 61 శాతం మంది బ్రాండెడ్ డెవలపర్స్ నుండి ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారత్లోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 2020 తో పోలిస్తే 39% పెరిగాయి. పెట్టుబడులకు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం కంటే కూడా రియల్ ఎస్టేట్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా 57 శాతం మంది ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. రియాల్టీ తర్వాత స్టాక్ మార్కెట్ పైన ఆసక్తి కనబరుస్తున్నారు.
అప్పుడు బంగారం.. ఇప్పుడు ఇళ్లు
కరోనా లాక్డౌన్ సమయంలో ఇన్వెస్టర్లు పసిడి కొనుగోలుకు ఆసక్తి చూపించారు. బంగారం ధర అంతకంతకూ పెరగడం, బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గడం, రియాల్టీ పెట్టుబడులకు అధిక మొత్తం అవసరం కావడం వంటి వివిధ కారణాలతో బంగారం వైపు చూశారు. 62 శాం మంది పెట్టుబడిదారులు ఇప్పుడున్న అతి తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు, డెవలపర్ డిస్కౌంట్స్, ఆఫర్ల నేపథ్యంలో ఇంటి కొనుగోలు పట్ల మక్కు చూపుతున్నారు.
సొంతం.. పెట్టుబడి
ఆస్తిని కొనాలని చూస్తోన్న 74 శాతం మంది పెట్టుబడిదారులు ఇంటిని సొంత వినియోగం కోసం తీసుకుంటున్నారు. 26 శాతం మంది మాత్రమే పెట్టుబడి కోణంలో చూస్తున్నారు. ఇంటిని వెంటనే వినియోగించడానికి రెడీ టు మూవ్ ఇన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాకుండా బ్రాండెడ్ డెవలపర్స్ వద్ద కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా రూ. 45 లక్షల నుండి రూ.1.5 కోట్ల ఇళ్లను ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు.