ATM Charges: ఖాతాదారులకు షాకిచ్చిన ప్రభుత్వ బ్యాంకు.. ఏటీఎం ఛార్జీలు పెంపు..!
ప్రభుత్వ రంగ బ్యాంకు కెనరా బ్యాంక్ ఖాతాదారులకు షాకిచ్చింది. తమ సేవింగ్స్ ఖాతాదారులకు వర్తించే కొన్ని ATM, క్యాష్ రీసైక్లర్ (cash recycler) ఛార్జీలను సవరించింది. సవరించిన మార్పులు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కెనరా బ్యాంక్ ATMలు లేదా క్యాష్ రీసైక్లర్లను ఉపయోగించే సాధారణ వినియోగదారులకు ఒక నెలలో ఉచిత లావాదేవీల సంఖ్యను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. సీనియర్ సిటిజన్లకు ఉచిత లావాదేవీల పరిమితి ఎనిమిదిగానే కొనసాగిస్తున్నారు. ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత, నగదు ఉపసంహరణ వంటి ఆర్థిక లావాదేవీలకు అయ్యే ఛార్జీని గతంలో ఉన్న రూ.20 + GST నుంచి రూ.23 + GSTకి పెంచారు.
ఉచిత పరిమితి దాటిన తర్వాత బ్యాలెన్స్ విచారణ వంటి ఆర్థికేతర లావాదేవీలకు బ్యాంక్ ఛార్జీని రూ.5 + GSTగానే ఉంచింది. ఖాతాలో తగినంత నిధులు లేకపోవడం వల్ల విఫలమయ్యే లావాదేవీలకు సంబంధించిన ఛార్జీని కూడా కెనరా బ్యాంక్ సవరించింది. ఉచిత పరిమితి దాటిన తర్వాత ఈ ఛార్జీ గతంలో ఉన్న రూ.17 + GST నుంచి రూ.23 + GSTకి పెంచింది. ఇతర బ్యాంకుల ATMలను ఉపయోగించే కెనరా బ్యాంక్ డెబిట్ కార్డ్ వినియోగదారులకు నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి యథాతథంగా కొనసాగుతుంది. మెట్రో నగరాల్లో మూడు, ఇతర ప్రాంతాల్లో ఐదుగా నిర్ణయించారు. ఉచిత పరిమితి దాటిన తర్వాత ఆర్థిక లావాదేవీలకు ఛార్జీ రూ.23 + GSTతో వసూలు చేస్తారు.

ఉచిత పరిమితి దాటిన తర్వాత 'గ్రీన్ పిన్' పునరుత్పత్తికి (regeneration) అయ్యే ఛార్జీని కూడా బ్యాంక్ రూ.23 + GST నుంచి రూ.5 + GSTకి తగ్గించింది. కెనరా బ్యాంక్ సేవా ఛార్జీల వివరాల ప్రకారం, సవరించిన ఛార్జీలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మధ్య అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛార్జీలను సవరించింది. అయితే ఈ ఛార్జీలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతా (BSBD) ఉన్నవారు ఒక నెలలో గరిష్ఠంగా 4 సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ 4 ఫ్రీ ఉపసంహరణలు దాటిన తర్వాత చేసే ప్రతి తదుపరి క్యాష్ లావాదేవీపై రూ.15 ప్లస్ జీఎస్టీ ఛార్జీగా వసూలు చేయనున్నారు.
ఈ నిబంధన బ్యాంక్ బ్రాంచ్, ఏటీఎం, మైక్రో ఏటీఎం, ఏఈపీఎస్ లేదా క్యాస్ పీఓఎస్ ద్వారా చేసే అన్ని రకాల నగదు విత్ డ్రాస్ కు వర్తిస్తుంది. నగదు ఉపసంహరణపై ఛార్జీలు పెంచినప్పటికీ, డిజిటల్ లావాదేవీలు ఉపయోగించే వారికి ఎస్బీఐ ఉపశమనం కల్పించింది. UPI,ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్ వంటి డిజిటల్ పద్ధతుల ద్వారా చేసే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లపై ఎటువంటి ఛార్జీలు ఉండవని బ్యాంకు పేర్కొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications