బ్యాంక్ సెలవులు, ఆదివారమైనా ఇక మీ EMI, సిప్ డెబిట్స్, శాలరీ క్రెడిట్ ఉంటుంది!
ఆగస్ట్ 1వ తేదీ(2021) నుండి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(NACH) ఆదివారం, బ్యాంకు సెలవు దినాలు సహా ప్రతి రోజు పని చేస్తుందని కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పష్టం చేసింది. అంటే ఆగస్ట్ 1 నుండి వేతనం నుండి ఈఎంఐ కట్టింగ్ వరకు పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే శాలరీ క్రెడిట్, హోమ్ లోన్, కారు లోన్, పర్సనల్ లోన్ ఈఎంఐ చెల్లింపులు, టెలిఫోన్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ వంటి బిల్లు పేమెంట్స్, ఆటో డెబిట్ సంబంధమైనవి ఆదివారం, బ్యాంకు సెలవు రోజుల్లోను ఉంటాయి. అంటే ఆదివారం కూడా శాలరీ క్రెడిట్ అవుతుంది.
సాధారణంగా అకౌంట్లో వేతనం జమ అయ్యే రోజు ఆదివారం లేదా బ్యాంకు సెలవు దినమైతే ఉద్యోగులు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నెల రోజుల పాటు వేచి చూసిన వేతనం ఒకరోజు ఆలస్యమైనా ఆ ఇబ్బంది ఉద్యోగులకే తెలుసు. ఆదివారం లేదా బ్యాంకు సెలవు దినం అయితే ఖాతాలో క్రెడిట్ అయ్యేందుకు బ్యాంకింగ్ సేవలు పునఃప్రారంభమయ్యే వరకు వేచి చూడాలి. ఎందుకంటే ఖాతాల్లోకి వేతనాలు, పెన్షన్, వడ్డీ, డివిడెండ్ వంటి వాటిని జమచేసే NACH ఇప్పుడు బ్యాంక్ పని దినాల్లో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహణలోని NACH బల్క్ పేమెంట్ వ్యవస్థ. ఆటో క్రెడిట్ సేవలతో పాటు విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, వాటర్, EMI, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా ప్రీమియం ఆటో డెబిట్ సేవలను అందిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రత్యక్ష నగదు బదిలీ, సబ్సిడీ చెల్లింపులు సైతం ఈ వ్యవస్థ ద్వారానే జరుగుతాయి.