లోన్ రికవరీ వేధింపులకు చెక్.. బ్యాంకులకు వార్నింగ్తో కూడిన మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్బీఐ
భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులపై కొరడా ఝళిపించింది. వారి ఆగడాలకు చెక్ పెట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రుణ వసూళ్ల పేరుతో బ్యాంకు ఉద్యోగులు, రికవరీ ఏజెంట్లు అతిగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇటీవల కాలంలో రుణగ్రహీతలకు అనుచిత సమయాల్లో ఫోన్ కాల్స్ చేయడం, బెదిరింపులు, అసభ్య పదజాలం వాడడం, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం వంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆర్బీఐ.. రుణ వసూళ్ల ప్రక్రియ మరింత పారదర్శకంగా, హుందాగా ఉండాలనే లక్ష్యంతో ఈ మార్గదర్శకాలను RBI రూపొందించింది.

కొత్త నిబంధనల ప్రకారం.. బ్యాంకులు రికవరీ ఏజెంట్లను ఎంపిక చేయడానికి ముందే వారి పూర్వాపరాలు, నైతిక ప్రమాణాలు, గత అనుభవాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి. నియామకం అనంతరం వారికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (IIBF) ద్వారా సరైన శిక్షణ ఇవ్వాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ శిక్షణ రుణ వసూళ్ల విధానం, కస్టమర్లతో వ్యవహరించాల్సిన తీరు, చట్టపరమైన పరిమితులపై దృష్టి సారించనుంది.
రుణ వసూళ్ల సమయంలో రికవరీ ఏజెంట్లు లేదా బ్యాంకు ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుచిత భాషను ఉపయోగించకూడదు. రుణగ్రహీతల పరువు, ప్రతిష్ఠ, గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం నిషేధం. అలాగే, రుణగ్రహీత కుటుంబంలో మరణం సంభవించినప్పుడు, ప్రకృతి విపత్తుల సమయంలో, పెళ్లిళ్లు లేదా పండగల సందర్భాల్లో వారి ఇళ్లకు వెళ్లి వసూళ్లు చేయరాదని ఆదేశించింది.
రుణ వసూళ్ల కోసం రికవరీ ఏజెంట్లు చేసే ఫోన్ కాల్స్ను తప్పనిసరిగా రికార్డు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. అలాగే, రుణగ్రహీతలకు పంపే సందేశాలు కూడా హుందాగా, మర్యాదపూర్వకంగా ఉండాలని పేర్కొంది. నిర్ణీత కాలవ్యవధిలో రికవరీ ఏజెంట్లకు పునఃశిక్షణ ఇవ్వాలని బ్యాంకులకు సూచించింది. బ్యాంకు ఉద్యోగులు, ఏజెంట్ల వద్ద ఉన్న రుణగ్రహీతల వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయరాదని హెచ్చరించింది. ఒకవేళ రుణ వసూలు అంశం కోర్టు విచారణలో ఉంటే.. అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బ్యాంకులు తమ ఉద్యోగులు, రికవరీ ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని ఆర్బీఐ సూచించింది.
రికవరీతో పాటు, బ్యాంకుల మిస్సెల్లింగ్కు చెక్ పెట్టేలా కూడా ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు చేసింది. కస్టమర్లకు అవసరం లేకున్నా ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవలను అంటగట్టేలా ప్రోత్సాహకాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. కస్టమర్ల నుంచి ముందస్తు సమ్మతి లభించిన తర్వాతే ఫోన్ ద్వారా సంప్రదించాలని.. పనివేళలు కాకుండా కాల్ చేయరాదని పేర్కొంది.
బ్యాంకులు తమ ఆర్థిక ఉత్పత్తులతో పాటు థర్డ్ పార్టీ ఉత్పత్తులను బలవంతంగా విక్రయించకూడదు. కస్టమరు తనకు నచ్చిన సంస్థ ఉత్పత్తిని ఎంచుకునే స్వేచ్ఛ కల్పించాలి. ఒకవేళ మిస్సెల్లింగ్ జరిగితే, కస్టమరు చెల్లించిన మొత్తం సొమ్మును రిఫండ్ చేయడమే కాకుండా, అతనికి కలిగిన నష్టానికి పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సవరణ ముసాయిదాపై మార్చి 4 వరకు ప్రజల అభిప్రాయాలను ఆర్బీఐ కోరింది. ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తే, రుణగ్రహీతలకు పెద్ద ఊరట కలగనుందని బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications


