భారత్లో ATMల సంక్షోభం.. మూడేళ్లలో మాయమైన 9 వేల ఏటీఎంలు..అసలు ఏం జరుగుతోంది..
దేశంలో సాంప్రదాయ నగదు లావాదేవీలకు వేదికగా ఉండే ఏటీఎం (ATM), క్యాష్ రీసైక్లర్ నెట్వర్క్ గత మూడేళ్లుగా నిలకడగా క్షీణిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదికల ఆధారంగా ఇండస్ ఈక్విటీ అడ్వైజర్స్ విడుదల చేసిన జూలై 2026 నాటి గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంల మొత్తం సంఖ్య మార్చి 2024 నాటి 2,18,815 నుండి మార్చి 2026 నాటికి 2,09,331కి పడిపోయింది. జూలై 2026 నాటికి ఈ సంఖ్య స్వల్పంగా పుంజుకుని 2,09,812కి చేరినప్పటికీ.. మార్చి 2024తో పోలిస్తే ఇప్పటికీ దేశంలో దాదాపు 9,000 యంత్రాలు తక్కువగానే ఉన్నాయి.
ఈ నెట్వర్క్ క్షీణతలో బ్యాంకింగ్ రంగాల వారీగా భిన్నమైన ధోరణులు కనిపించాయి. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు తమ ఏటీఎం మార్కెట్ వాటాను 61.56 శాతం నుండి 64.18 శాతానికి పెంచుకోగా, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు గణనీయంగా వెనుకంజ వేసి తమ వాటాను 36.51 శాతం నుండి 33.76 శాతానికి తగ్గించుకున్నాయి. మరొకవైపు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మాత్రం చిన్న స్థాయి నుండి తమ ఏటీఎం వాటాను రెట్టింపు కంటే ఎక్కువగా పెంచుకోవడం గమనార్హం.

కేవలం యంత్రాల సంఖ్య తగ్గడమే కాకుండా.. వాటి ద్వారా జరుగుతున్న నగదు విత్డ్రాయల్స్ విలువ కూడా ఊహించని రీతిలో పడిపోయింది. మార్చి 2024లో ఏటీఎంలు, సీఆర్ఎంల ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ. 2.77 లక్షల కోట్లుగా ఉండగా, జూలై 2026 నాటికి అది రూ. 2.20 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఏటీఎం నగదు లావాదేవీలలో 20 శాతానికి పైగా తగ్గుదల నమోదైంది.
నగదు మౌలిక సదుపాయాలు క్షీణించడానికి ప్రధాన కారణం దేశంలో యూపీఐ (UPI) డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరగడమేనని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే కాలంలో ఆన్లైన్ చెల్లింపుల పరిమాణం 20.69 కోట్ల నుండి 33.51 కోట్లకు చేరి దాదాపు రెట్టింపు కాగా, డెబిట్ కార్డ్ ఖర్చు రూ. 3.21 లక్షల కోట్ల నుండి రూ. 2.57 లక్షల కోట్లకు పడిపోయింది. భారతీయులు ఏటీఎంల ద్వారా నగదు విత్డ్రా చేయడం తగ్గించి, పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల్లో కార్డ్ స్వైపింగ్ నిలిపివేసి, పూర్తిస్థాయిలో యూపీఐ లావాదేవీలపై ఆధారపడుతున్నారని ఈ నివేదిక తేటతెల్లం చేస్తోంది. మారుతున్న వినియోగదారుల అలవాట్లకు అనుగుణంగా బ్యాంకులు కూడా ఏటీఎంల విస్తరణను నెమ్మదింపజేసి డిజిటల్ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
