మారటోరియం వడ్డీ మాఫీ: వీరికి ఎక్స్గ్రేషియా ఊరటలేదు... కేంద్రం స్పష్టత
కరోనా నేపథ్యంలో లోన్ మారటోరియంకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది. మార్చి నుండి ఆగస్ట్ వరకు ఆరు నెలల కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తామని, దానిని తామే భరిస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇటీవల ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆర్థికమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మారటోరియంను ఉపయోగించుకున్న వారికి వడ్డీపై వడ్డీని మాఫీ చేయడంతో పాటు, ఉపయోగించుకోని వారికి ఆ మేరకు డబ్బులు జమ చేయనుంది. అయితే మారటోరియం చక్రవడ్డీ స్కీం అందరికీ వర్తించదు.
Loan Moratorium: దరఖాస్తు అవసరంలేదు, వారికీ ప్రయోజనం.. వడ్డీ మాఫీపై మరో ఊరట!
వ్యవసాయ రుణాలకు మాఫీలేదు
గతవారం ప్రభుత్వం ప్రకటించిన చక్రవడ్డీ మినహాయింపు వ్యవసాయం, అనుబంధ రంగాలకు వర్తించదని ఆర్థికమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పంట, ట్రాక్టర్ రుణాలు వ్యవసాయ రుణాల కిందకు వస్తాయని, వీటికి వడ్డీ మాఫీ ఉండదని తెలిపింది. వడ్డీ మాఫీపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేలా తరుచూ అడిగే ప్రశ్నల జాబితా(FAQ)ను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
క్రెడిట్ కార్డ్ బకాయిలు...
ఫిబ్రవరి 29 నాటికి క్రెడిట్ కార్డు బకాయిలకు ఈ ఉపశమనం వర్తిస్తుందని తెలిపింది. క్రెడిట్ కార్డ్స్ బకాయిలకు సంబంధించి మార్చి 1 నుండి ఆగస్ట్ 31 వరకు కస్టమర్ల నుండి ఈఎంఐ ప్రతిపాదన ఫైనాన్స్ చేసిన ట్రాన్సాక్షన్స్ కోసం కార్డు జారీ చేసేవారు వసూలు చేసే సగటు రుణ రేటునే వడ్డీ రేటుగా పరిగణిస్తామని తెలిపింది. ఆరు నెలల మారటోరియం కాలానికి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి ఉన్న తేడాను రుణగ్రహీతల ఖాతాల్లో బ్యాంకులు జమ చేస్తాయి. నవంబర్ 5వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం, ఆర్బీఐ ఆర్థిక సంస్థలను కోరాయి.
ఎక్స్గ్రేషియా....
లోన్ మారటోరియం వ్యవధిలో సాధారణవడ్డీ, చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని రుణగ్రహీతల ఖాతాల్లో బ్యాంకులు జమచేస్తాయి. ఎక్స్గ్రేషియా లెక్కింపునకు ఫిబ్రవరి 29వ తేదీ నాటికి కలిగి ఉన్న అసలు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. రూ.2 కోట్ల దాకా MSME, స్టడీ లోన్, హోమ్ లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు మొదలైన వాటికి ఈ స్కీం వర్తిస్తుంది. నిబంధనల మేరకు ఫిబ్రవరి 29 నాటికి మొండి బకాయిలుగా ఉండరాదు. మార్చి 1 నుంచి ఆగస్ట్ 21వ తేదీ కాలానికి (184 రోజులు) రీఫండ్ చేయనున్నారని తెలుస్తోంది. మారటోరియం ఎంచుకున్న వారికి, ఎంచుకోని వారికి, పాక్షికంగా ఉపయోగించుకున్న వారికి కూడా ఎక్స్గ్రేషియాను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.