లోన్ EMI మిస్ అయ్యిందా.. RBI కొత్త రూల్స్లో కీలక మార్పులివే.. రికవరీ ఏజెంట్లు వేధిస్తే కఠిన చర్యలు..
పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా కార్ లోన్ ఈఎమ్ఐ (EMI) చెల్లించడంలో ఆలస్యమైతే.. బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు సదరు రుణగ్రహీతల వ్యక్తిగత స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు లేదా టాబ్లెట్లను రిమోట్గా లాక్ చేయడం లేదా నిలిపివేయడం చెల్లదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది. రుణ వసూలు పేరుతో రికవరీ ఏజెంట్లు, ధనసహాయం చేసిన సంస్థలు సాంకేతికతను దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు ఆర్బీఐ సవరించిన కఠిన నిబంధనలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన మార్గదర్శకాలు జనవరి 1, 2027 నుండి అమలులోకి రానున్నాయి.
సాధారణంగా వ్యక్తిగత, గృహ, వాహన రుణాలతో ఏమాత్రం సంబంధం లేని మీ వద్ద ఉన్న వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను బ్యాంకులు లాక్ చేయలేవు. ఒకవేళ మీరు కేవలం ఒక నిర్దిష్ట స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనుగోలు చేయడం కోసమే ప్రత్యేకంగా రుణం తీసుకుని (Device Financing).. ఒప్పంద పత్రాల్లో డిఫాల్ట్ అయితే పరికరాన్ని నిలిపివేస్తాం అనే నిబంధనకు ముందస్తుగా అంగీకారం తెలిపిన సందర్భాల్లో మాత్రమే రుణదాత నిర్దేశిత ప్రక్రియను అనుసరించి సాంకేతిక పరిమితులు విధించేందుకు వెసులుబాటు ఉంటుంది.

ఒక్క ఈఎమ్ఐ తప్పిన వెంటనే లాక్ చేయడం కుదరదు: ఈ నూతన నిబంధనల్లో రుణగ్రహీతల రక్షణకు ఆర్బీఐ ప్రాధాన్యమిచ్చింది. రుణగ్రహీత ఒక్క ఈఎమ్ఐ చెల్లింపులో విఫలమైన వెంటనే రుణదాత ఫైనాన్స్ చేసిన పరికరాన్ని నిలిపివేయడానికి వీల్లేదు. రుణ ఖాతా కనీసం 30 రోజులు బకాయిపడి.. ముందస్తు నోటీసు జారీ చేసిన తర్వాత మాత్రమే ప్రాథమిక పరిమితులను విధించవచ్చు. ఖాతా వరుసగా 60 రోజులు దాటి బకాయి పడినప్పుడు మాత్రమే.. ఒప్పంద నిబంధనల ప్రకారం విస్తృత స్థాయి ఆంక్షలను అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యవధి రుణగ్రహీతలు తమ బకాయిలను చెల్లించి ఖాతాను క్రమబద్ధీకరించుకోవడానికి దోహదపడుతుంది.
కాల్స్ నిలిపివేత, వ్యక్తిగత డేటా యాక్సెస్ సైతం నేరమే: పరికరంపై సాంకేతిక ఆంక్షలు విధించినప్పటికీ, సదరు స్మార్ట్ఫోన్లో ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ (SMS), అత్యవసర ఎస్ఓఎస్ (SOS) సేవలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండాలి. అత్యవసర సమాచార మార్పిడికి రుణగ్రహీత దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ భద్రతా చర్యను పొందుపరిచారు.
దీనికితోడు రికవరీ ఏజెంట్లు లేదా రుణ సంస్థలు మీ ఫోన్లో ఉన్న ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ లిస్ట్, మెసేజ్లు, కాల్ హిస్టరీ మరియు లొకేషన్ డేటాను యాక్సెస్ చేయడం తీవ్రమైన నేరం. మీ వ్యక్తిగత సమాచారాన్ని వసూళ్లకు సాధనంగా ఉపయోగించరాదు.
బెదిరింపులు, భయాందోళనలకు చెక్: బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, వాటి రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలను భయపెట్టడం, వేధించడం లేదా బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి బహిరంగంగా అవమానించడం వంటి చట్టవిరుద్ధమైన పద్ధతులకు దూరంగా ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. వసూలు ప్రక్రియ కేవలం రుణగ్రహీతతోనే సముచిత వాతావరణంలో జరగాలని స్పష్టం చేసింది.
ఈ సవరించిన నిబంధనలు వినియోగదారుల హక్కులకు, గోప్యతకు పూర్తి రక్షణను అందిస్తాయి. అయితే, ఈ వెసులుబాట్లను ఆసరాగా చేసుకుని రుణం తిరిగి చెల్లించకుండా ఉండటానికి వీల్లేదు. ఈఎమ్ఐ ఆలస్యమైతే వడ్డీ, జరిమానాలతో పాటు సీబీఐఎల్ (CIBIL) స్కోరు తీవ్రంగా దెబ్బతింటుంది. చెల్లింపుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు బ్యాంకులతో నేరుగా చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడమే శ్రేయస్కరం.


Click it and Unblock the Notifications
