మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు బేజారు.. ఎందుకంటే: అప్పటి వరకు ఒత్తిడి
స్మాల్ క్యాప్ అంటే సాధారణంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5000 కోట్ల కంటే తక్కువగా ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది కంపెనీ అత్యుత్తమ సంఖ్యలో అందుబాటులో ఉన్న షేర్ల మార్కెట్ వ్యాల్యూని సూచిస్తుంది. సెబి ప్రకారం మార్కెట్ క్యాప్ పరంగా 251 నుండి అంతకంటే ఎక్కువ ర్యాంకులో ఉన్నవి. కరోనా మహమ్మారి సమయంలో చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ కాలంలో స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు మంచి లాభాలను ఇచ్చాయి. అయితే 2022లో మాత్రం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు ఢీలా పడ్డాయి.
అందుకే వీటిపై ప్రభావం
బీఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు 2022 క్యాలెండర్ ఏడాదిలో 4 శాతం వరకు క్షీణించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఎఫ్ఐఐల అమ్మకాలు, క్రూడ్ ధరలు, ద్రవ్యోల్భణ భయాలు వంటి అంశాలు ప్రభావం చూపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మరింతకాలం ఈ స్టాక్స్ చిక్కులు ఎదుర్కొనే అవకాశముందని చెబుతున్నారు. ఈ ఏఢాదిలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1095 పాయింట్లు లేదా 3.72 శాతం, మిడ్ క్యాప్ సూచీలు 666 పాయింట్లు లేదా 2.66 శాతం చొప్పున నష్టపోయాయి. ఇదే కాలంలో సెన్సెక్స్ 1277 పాయింట్లు లేదా 2.19 శాతమే క్షీణించింది.
పెద్ద కంపెనీల వైపు దృష్టి
అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు, ద్రవ్యోల్భణ కాలంలో ఒడిదుడుకులు వీటిపై ప్రభావం చూపుతున్నాయి. గత ఏడాది మార్కెట్ పరుగులు పెట్టింది. ఈ ఏడాది స్థిరీకరించుకుంది. దీంతో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలపై కాస్త ప్రభావం చూపుతుంది. సాధారణంగా విదేశీ ఇన్వెస్టర్లు బ్లూచిప్స్, పెద్ద షేర్ల పైన దృష్టి పెడితే చిన్న షేర్ల వైపు లోకల్ ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. ద్రవ్యోల్భణం కారణంగా వీరు కూడా పెద్ద షేర్లలో ఇన్వెస్ట్ చేయడం లేదా సురక్షిత పెట్టుబడి వైపు మరలడం చేస్తున్నారు.
రక్షణాత్మకంగా భావించడం వల్లే
సాధారణంగా మార్కెట్ ఊగిసలాట సమయంలో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు లార్జ్ కంపెనీల స్టాక్స్ను రక్షణాత్మకంగా భావిస్తారని, స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ను విక్రయించేందుకు మొగ్గు చూపుతారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ సానుకూలత ఏర్పడే వరకు స్మాల్ లేదా మిడ్ క్యాప్ సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటాయని చెబుతున్నారు.