భారీ లాభాల నుండి ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు, ఈ స్టాక్స్ 57% జంప్
స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ప్రారంభమై, చివరకు ఫ్లాట్గా లేదా అతిస్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం దాదాపు 600 పాయింట్ల లాభాల్లో ప్రారంభమై, ఆ తర్వాత 900 పాయింట్ల లాభాల్లోకి దూసుకెళ్లిన సెన్సెక్స్, అనంతరం అంతకంతకూ క్షీణించింది. చివరి గంటన్నరలో అయితే మరింత పడిపోయింది. అయితే భారీ లాభాల నుండి ఫ్లాట్కు పడిపోయిన సెన్సెక్స్, అదే స్థాయిలో ముగిసింది. ఓ సమయంలో స్వల్ప నష్టాల్లోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత కోలుకుంది.
భారీ లాభాల నుండి ఫ్లాట్గా
ఆర్బీఐ ఇచ్చిన షాక్తో బుధవారం సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. నేడు (గురువారం) ఉదయం కోలుకుంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచినప్పటికీ దూకుడు ఉండబోదనే సంకేతాలతో అక్కడి మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై కనిపించింది. కొనుగోళ్లకు మద్దతు లభించింది. ఈ ప్రభావం మన మార్కెట్ పైన కనిపించింది. కానీ మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ ఉదయం 56,255 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,566.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,613.82 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 33 పాయింట్లు లాభపడి 55,702 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 16,982 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఓ సమయంలో 900 పాయింట్లు ఎగిసింది. చివరకు నేటి గరిష్టంతో పోలిస్తే 800 పాయింట్లకు పైగా క్షీణించి ముగిసింది.
మిశ్రమంగా
వివిధ రంగాలు మిశ్రమంగా ముగిశాయి. పవర్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ సూచీలు 1 శాతం నుండి 2 శాతం లాభపడ్డాయి. రియాల్టీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా సూచీలు మాత్రం 0.5 శాతం నుండి 1.5 శాతం నష్టపోయాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టెక్ మహీంద్రా, హీరో మోటో కార్ప్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, బ్రిటానియా, నెస్ట్లే, అల్ట్రా టెక్ సిమెంట్ ఉన్నాయి.
ఈ స్టాక్స్ 15 శాతానికి పైగా జంప్
ఇదిలా ఉండగా, నేడు పలు స్టాక్స్ 15 శాతానికి పైగా లాభపడ్డాయి. మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ 57 శాతం, స్టార్ టెక్ ఫైనాన్స్ 18 శాతం లాభపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,59,64,889.37 కోట్లుగా నమోదయింది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.17.86 లక్షల కోట్ల వద్ద ఉంది.