ఈ సేవింగ్ అకౌంట్ ఉందా? డిసెంబర్ 12 నుండి మారుతున్న రూల్
పోస్టాఫీస్లో మీరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశారా? అయితే ఇది మీ కోసమే! సాధారణంగా బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ నిబంధన తెలిసిందే. ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటుంది. అలాగే, నగరాలు, పట్టణాలు, గ్రామీణ కస్టమర్లకు వివిధ రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ కనీసం రూ.10వేలు. నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలు, రూ.3వేలుగా ఉంటుంది. పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాల్లోను కొత్త నిబంధన ఉంది. ఇప్పటి వరకు ఉన్న కనీస మినిమం బ్యాలెన్స్ పరిమితిని పది రెట్లు పెంచారు.
HDFC, SBI కస్టమర్లకు ఇబ్బందులపై RBI గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ఎంత పరిమితి, ఎప్పటి నుండి అమల్లోకి...
పోస్టల్ సేవింగ్స్ అకౌంట్లో కనీస నిల్వ పరిమితి లేకుంటే నిర్వహణ చార్జీల రూపంలో భారీగా ఫైన్ పడనుంది. పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ పరిమితి రూ.50 నుంచి రూ.500కు పెంచారు. డిసెంబర్ 12 నుంచి ఇది అమల్లోకి వస్తోంది. అంటే ఈ నెల 12వ తేదీ నుండి ఈ ఖాతా కలిగిన వారు రూ.500కు తగ్గకుండా ఉంచాలి. లేదంటే మెయింటెనెన్స్ చార్జీ ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి రోజున రూ.100 చొప్పున మినహాయిస్తారు.
11వ తేదీ వరకల్లా బ్యాలెన్స్
ఈ మేరకు ఇండియా పోస్ట్ గత శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 'సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు కనీసం రూ.500 కలిగి ఉండటం తప్పనిసరి.' అని వెబ్సైట్లో తెలిపింది. అలాగే సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లోను తెలిపింది. డిసెంబర్ 11వ తేదీ కల్లా మినిమం బ్యాలెన్స్ కలిగి ఉండాలని వెల్లడించింది. మినిమం బ్యాలెన్స్ లేకుంటే ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి రోజున రూ.100 చొప్పున ఫైన్ వేస్తారు. ఖాతాల్లో సొమ్ము ఖాళీ అయితే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది.
వడ్డీ చెల్లించరు..
పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంటును పెద్దవారు సింగిల్గా లేదా జాయింట్గా ఇద్దరు తెరుచుకోవచ్చు. పదేళ్ల వయసు దాటిన మైనర్లు తన సొంత పేరుతో ఈ అకౌంట్ తెరువవచ్చు. మైనర్ లేదా మానసికస్థితి సరిగాలేని వ్యక్తి తరఫున గార్డియన్ ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ పోస్టల్ సేవింగ్స్ ఖాతాలను తెరిచేందుకు వీల్లేదు. ఈ ఖాతాను తెరిచే సమయంలో నామినీ పేరును పొందుపరచాలి. సింగిల్ లేదా జాయింట్ ఖాతాలకు ప్రస్తుతం నాలుగు శాతం వార్షికవడ్డీ చెల్లిస్తున్నారు. ఖాతాలో ప్రతి నెలా 10వ తేదీ నుంచి ఆ నెల చివరి మధ్యలో ఉండే కనీస నగదు నిల్వను ఆధారంగా చేసుకుని ఈ వడ్డీని లెక్కిస్తారు. ఇక నుండి ఈ సమయంలో రూ.500 కంటే తక్కువ నగదును నిల్వ ఉంటే వడ్డీ చెల్లించరు.