Investors alert: మార్కెట్ జంప్ వెనుక...: 7 నెలల్లో 7000 పాయింట్లు
సెన్సెక్స్ మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజుల పాటు భారీ లాభాల్లో ముగియడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే నిన్న ప్రాఫిట్ బుకింగ్ కారణంగా సూచీలు నష్టపోయాయి. అయితే నేడు సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 57,600 పాయింట్లు క్రాస్ చేసి, 58,000 దిశగా పరుగులు పెడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆశాభావం, అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారు. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ బలపడటం కూడా కలిసి వచ్చింది.
నిన్నటికి ఇన్వెస్టర్ల సంపదగా భావించే టాప్ 100 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,50,15,326.61 కోట్లుగా ఉంది. ఇన్వెస్టర్ల సంపద గత ఐదు ట్రేడింగ్స్లో రూ.8 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.250 లక్షల కోట్లను తాకింది. సూచీలు అప్పుడప్పుడు ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో నష్టాల్లోకి వెళ్తున్నప్పటికీ, మొత్తానికి ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డును తాకుతున్నాయి. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆశాభావం, అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. రూపాయి క్రమంగా బలపడటం కలిసి వస్తోంది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ వరుసగా పెరుగతూ మంగళవారం 12 వారాల గరిష్టానికి చేరింది. భారత ఆర్థిక వ్యవస్థ మున్ముందు మరింత బాగా రాణిస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయపడింది. 2021లో 9.6 శాతం, 2022లో 7 శాతం వృద్ధి అంచనాలను యథాతథంగా కొనసాగించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(ఏప్రిల్-జూన్) త్రైమాసికానికి గాను జీడీపీ వృద్ధి రేటు 20.1 శాతంతో అదరగొట్టింది.
ప్రపంచ మార్కెట్ నుండి, దేశీయ ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకోవడంతో దేశీయంగా కలిసి వచ్చి భారతీయ స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ సూచీ గత ఏడాది ఆగస్ట్ (2020) నుండి ఇప్పుడు స్థిరమైన పెరుగుదలను చూసింది. ఆగస్ట్ 27న ఈ సూచీ 35,455ను తాకింది. అమెరికాతో పాటు హాంగ్ షెంగ్ (హాంగ్కాంగ్), నిక్కీ (జపాన్) కూడా ఇలాగే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏదేమైనా భారత స్టాక్ మార్కెట్ మరింత కాలం ఇదే ధోరణితో ముందుకు సాగవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
పర్చేజింగ్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ(PMI)లో రికవరీ, CMIE సర్వేలో ఉపాధి రేటు పెరుగుదల, మ్యాక్రో - ఎకనమిక్ పరిస్థితుల్లో అభివృద్ధి, ఉత్పత్తి/తయారీలో వృద్ధి, సానుకూల జీడీపీ గణాంకాలు వంటి అంశాలు ఈక్విటీ మార్కెట్కు కొత్త ఊతమిస్తున్నాయి. అదే సమయంలో దేశీయంగా కరోనా కేసులను నియంత్రించడం, పెరుగుతున్న వ్యాక్సినేషన్ వంటి అంశాలు మార్కెట్ ఉత్తేజానికి కలిసి వస్తున్నాయి.
అదే సమయంలో భారత్ బలమైన మార్కెట్ వెనుక మరో కీలకమైన అంశం విదేశీ పోర్ట్పోలియో పెట్టుబడిదారుల(FPI) కంటే దేశీయ సంస్థాగత పెట్టుడిదారులు(DII) పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది మార్చి సమయంలో కరోనా ప్రారంభమైనప్పుడు సూచీలు పాతాళానికి పడిపోయాయి. అప్పటి నుండి సంస్థాగత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ వైపు మరింత ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. నాటి నుండి కుదుపులు వస్తున్నప్పటికీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ ఆశలను మాత్రం కోల్పోలేదు. పైగా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మార్చి 2020 నుండి వారు రూ.55,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు.
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ కాలంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా FPIలు వెనక్కి వెళ్లినప్పటికీ DIIలు మాత్రం పెరిగాయి. ఏప్రిల్ నెలలో రూ.9669 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అదే సమయంలో FPIలు రూ.11,101 కోట్లు వెనక్కి వెళ్లాయి. ఆగస్ట్ నెలలో DIIలు రూ.8,078 ఇన్వెస్ట్ చేయగా, ఈ ఏడాది ఏప్రిల్ నుండి రూ.46,940 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇక ఆగస్ట్ నెలలో FPIలు కేవలం రూ.986 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. జూన్ నాటికి FPIలు కేవలం రూ.14,137 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. FPIలు ఏప్రిల్ నెలలో రూ.8836 కోట్లు, మే నెలలో రూ.1958 కోట్లు వెనక్కి తీసుకున్నాయి. దేశీయ పెట్టుబడిదారులు గతంలో ఎన్నడూ లేని విధంగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మ్యూచువల్ ఫండ్స్, సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP) తదితర రంగాలు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఏప్రిల్-జూన్ కాలంలో మ్యూచవల్ ఫండ్స్ నికర ఈక్విటీ పర్చేజ్ రూ.32,155 కోట్లుగా ఉంది. ఇది రిటైల్ ఇన్వెస్టర్ల నుండి పెరిగిన నిధుల ప్రవాహాన్ని ప్రతిబింబిస్తుంది. జూన్లో SIP అకౌంట్ రిజిస్ట్రేషన్స్ రికార్డ్ స్థాయిలో 2.13 మిలియన్లు మార్చిలో 1.67 మిలియన్ ఖాతాలు ఉన్నాయి. కరోనా థర్డ్ వేవ్ కూడా మార్కెట్కు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నది.
2021లో సెన్సెక్స్ రికార్డ్స్
జవరి 21న 50,000 పాయింట్లను తాకిన సెన్సెక్స్, ఆ తర్వాత ఫిబ్రవరి 3న దీనిని నిలబెట్టుకుంది.
ఫిబ్రవరి 5న 51,000ను తాకిన సెన్సెక్స్ ఆ తర్వాత ఫిబ్రవరి 8న ఈ మార్కు పైన ముగిసింది.
ఫిబ్రవరి 15న 52,000ను తాకిన సెన్సెక్స్ అదే రోజు ఈ మార్కు పైన ముగిసింది.
జూన్ 22న 53,000ను తాకిన సెన్సెక్స్ ఆ తర్వాత జూలై 7న ఈ మార్కు పైన ముగిసింది.
ఆగస్ట్ 4న 54,000ను తాకిన సెన్సెక్స్ ఆ తర్వాత ఆగస్ట్ 13న ఈ మార్కు పైన ముగిసింది.
ఆగస్ట్ 13న 55,000ను తాకిన సెన్సెక్స్ అదే రోజు ఈ మార్కు పైన ముగిసింది.
ఆగస్ట్ 18న 56,000ను తాకిన సెన్సెక్స్ ఆ తర్వాత ఆగస్ట్ 27న ఈ మార్కు పైన ముగిసింది.
ఆగస్ట్ 31న 57,000ను తాకిన సెన్సెక్స్ అదే రోజు ఈ మార్కు పైన ముగిసింది.