రికార్డు స్థాయిలో నగదు ఉన్నా ATMల్లో డబ్బు ఎందుకు దొరకడం లేదు.. క్యాష్ కొరత వెనుక అసలు నిజాలివే..
దేశంలో ఒకవైపు భౌతిక కరెన్సీ చలామణి రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తాజా గణాంకాల ప్రకారం.. మే 22 నాటికి భారతదేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో రూ.42.54 లక్షల కోట్లకు పెరిగింది.
అయినప్పటికీ, దేశంలోని పలు ఏటీఎం మెషీన్లలో నగదు కొరత తలెత్తే ప్రమాదం ఉందని ఏటీఎం ఆపరేటర్లు, నగదు లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధి సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) హెచ్చరించింది. ఏటీఎంలలో క్రమబద్ధంగా నింపడానికి అవసరమైన నగదుకు ,వాస్తవంగా అందుబాటులో ఉన్న మొత్తానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)కు 'క్యాట్మీ' సమర్పించిన అంతర్గత నివేదిక ప్రకారం.. ఏటీఎం ఆపరేటర్లు తమకు కావాల్సిన మొత్తం నగదును పూర్తిస్థాయిలో అందుకోలేకపోతున్నారు. గత మార్చి నెలలో తమ మొత్తం Cash అవసరంలో కేవలం 64 శాతం, ఏప్రిల్ నెలలో కేవలం 57 శాతం మాత్రమే ఆపరేటర్లు పొందగలిగారు. వాస్తవానికి ఈ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా ఏటీఎంలలో డబ్బు నింపడానికి సుమారు రూ. 94 వేల కోట్లు అవసరం కాగా, మార్చిలో కేవలం రూ.61 వేల కోట్లు, ఏప్రిల్లో రూ. 54 వేల కోట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.
దీనికి తోడు పెరిగిన ఇంధన ధరలు, సిబ్బంది వేతనాల కారణంగా ఏటీఎంల నిర్వహణ, నగదు రవాణా, భద్రత వంటి వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు, దేశంలో యూపీఐ (UPI) వంటి డిజిటల్ చెల్లింపులు విప్లవాత్మకంగా దూసుకుపోతుండటంతో ఏటీఎంల వినియోగం క్రమంగా తగ్గుతోంది. ఏడాది క్రితం మే నెలలో 498.4 మిలియన్లుగా ఉన్న ఏటీఎం లావాదేవీలు ఈసారి 446.5 మిలియన్లకు పడిపోయాయి. అలాగే విత్డ్రాయల్స్ విలువ కూడా రూ.2.64 ట్రిలియన్ల నుండి సుమారు రూ. 2.5 ట్రిలియన్లకు తగ్గింది. దీనివల్ల ఆపరేటర్లకు నిర్వహణ ఖర్చులు భారం కావడంతో పాటు మౌలిక సదుపాయాల కొరత కూడా ఎదురవుతోంది.
ఈ నగదు కొరత ప్రభావం పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాలలో అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వయోవృద్ధులు, పింఛనుదారులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, రైతులు ,చిన్న వ్యాపారులు తమ దైనందిన లావాదేవీల కోసం ఇప్పటికీ భౌతిక కరెన్సీపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అనేక గ్రామాలలో సమీపంలోని ప్రత్యామ్నాయ ఏటీఎం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల, అక్కడ నగదు లేకపోతే వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు ,చిన్న వ్యాపారుల వద్ద డిజిటల్ బోర్డులు లేకపోవడం వల్ల కూడా నగదు వినియోగం తప్పనిసరి అవుతోంది. సాధారణంగా ఏటీఎంలలో ఎక్కువ కాలం పాటు నగదు అందుబాటులో ఉంచకపోతే ఆర్బిఐ సదరు బ్యాంకులపై జరిమానాలు విధించే నిబంధన ఉంది. విడివిడి సంఘటనలపై చర్యలు తీసుకోకపోయినా, పదేపదే లేదా విస్తృతంగా కొరత ఏర్పడితే మాత్రం ఆర్బిఐ దీనిని తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది.
అయితే, ఈ హెచ్చరికల వల్ల సామాన్య వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది బ్యాంకు డిపాజిట్ల భద్రతకు గానీ లేదా దేశంలో కరెన్సీ కొరతకు గానీ సంబంధించిన సంక్షోభం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మార్కెట్లో నగదు చలామణి రికార్డు స్థాయిలోనే ఉన్నందున, కేవలం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని ఏటీఎంలలో మాత్రమే అప్పుడప్పుడు తాత్కాలికంగా నగదు విత్డ్రా చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
అందువల్ల, అత్యవసర పరిస్థితుల్లో అంతరాయాలను నివారించడానికి వినియోగదారులు యూపీఐతో పాటు ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతులను అందుబాటులో ఉంచుకోవాలని, అలాగే తమ వద్ద కొంత మొత్తంలో ముందస్తుగా భౌతిక నగదును నిల్వ ఉంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications
