Gold Price Today: గతవారం రూ.800 పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు గతవారం రూ.47,000 క్రాస్ చేశాయి. చివరి సెషన్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు రూ.200 పెరిగింది. గతవారం గోల్డ్ ఫ్యూచర్ ధర రూ.800 వరకు పెరిగింది. రూ.46,200 పైన ప్రారంభమైన పసిడి వారాంతానికి రూ.47,013కు చేరుకుంది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్లో రూ.186.00 (0.40%) పెరిగి రూ.47013.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.250.00 (0.53%) పెరిగి రూ.47237.00 వద్ద క్లోజ్ అయింది.
ఇక డిసెంబర్ సిల్వర్ కిలో చివరి సెషన్లో రూ.539.00 (0.88%) పెరిగి రూ.61797.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.580.00 (0.94%) పెరిగి రూ.62270.00 వద్ద ట్రేడ్ ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.95 (-0.11%) డాలర్లు క్షీణించి 1,757.25 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.022 (+0.10%) పెరిగి 22.680 డాలర్ల వద్ద ముగిసింది.
ఇదిలా ఉండగా, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ETFs)లోకి మొత్తం ఫండ్ ప్రవాహాలు సెప్టెంబర్ నెలలో ప్రతికూలంగా ఉండటంతో పెట్టుబడిదారులు తమ గోల్డ్ ఎక్స్పోజర్న తగ్గించుకున్నట్లుగా కనిపిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వరుసగా రెండో నెల గోల్డ్ ఔట్ ఫ్లో పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం జూలై నెలలో ఔట్ ఫ్లో 22.4 టన్నులుగా ఉంది.
గత నెల రోజుల్లో బంగారం ధరలు నాలుగు శాతం వరకు తగ్గింది. ఈ ప్రభావం బులియన్ మార్కెట్ పైన ఉంది. సెప్టెంబర్ నెలలో దేశీయ గోల్డ్ ఈటీఎఫ్స్ రూ.446 కోట్ల ప్రవాహం ఉంది. బంగారంపై పెట్టుబడులు స్వల్పంగా తగ్గినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.