Gold Price Outlook: 2021లో బంగారం రూ.50,000 దాటుతుందా?
కరోనా నేపథ్యంలో అనిశ్చితి కొనసాగుతుండటంతో భారత్లో ఈ ఏడాది బంగారానికి డిమాండ్ స్తబ్దుగా కొనసాగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(WGC) తాజా నివేదికలో పేర్కొంది. 2022లో మాత్రం డిమాండ్ పెరగవచ్చునని అంచనా వేసింది. ఆదాయాలు పెరగడంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశముందని తెలిపింది. కరోనా తదుపరి దశల కారణంగా ఏదైనా అనిశ్చితి ఏర్పడితే మాత్రం వచ్చే సంవత్సరం పసిడి ఒత్తిడికి గురికావొచ్చు. హాల్ మార్కును తప్పనిసరి చేయడం వల్ల పసిడి పరిశ్రమ మరింత పారదర్శకత దిశగా అడుగులు వేసింది.
ఆర్థిక రికవరీ వేగవంతమవుతుంటే క్రమంగా బంగారానికి డిమాండ్ కూడా పెరుగుతుంది. కానీ వ్యవసాయ ఆదాయాలు తగ్గడం ఈసారి ప్రతికూలం. మన దేశంలో ఎక్కువగా పొదుపు చేసుకున్న వాటితో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా బంగారంపై పెట్టుబడి పెట్టడం కాస్త తగ్గవచ్చు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో బంగారంలో పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. దేశ తలసారి ఆదాయం ఒక శాతం పెరిగితే బంగారానికి డిమాండ్ 0.9 శాతం మేర పెరగవచ్చు. ఏడాదిలో బంగారం ధర ఒక శాతం తగ్గినా డిమాండ్ 1.2 శాతం మేర పెరుగుతుందని, ద్రవ్యోల్భణం ఒక శాతం పెరిగినా పసిడికి డిమాండ్ 2.6 శాతం పెరుగుతుందని అంచనా.
కరోనా నేపథ్యంలో బంగారం ధరలు గత ఏడాది ఆగస్ట్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200కు చేరుకున్నాయి. 2020 ఆగస్ట్ కాలంలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఆర్థిక రికవరీ కారణంగా 2021లో మంచి రిటర్న్స్ వచ్చాయి. అయితే ఇటీవల బంగారం ధరలు రూ.46వేల నుండి రూ.48,000 దిగువన కదలాడుతోంది. ఎంసీఎక్స్లో నేడు బంగారం ధరలు రూ.47,500 క్రాస్ చేశాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.221 పెరిగి రూ.47,501కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోను దాదాపు 15 డాలర్లు పెరిగి 1785 డాలర్లను తాకింది.
2021 క్యాలెండర్ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు 1900 డాలర్లకు చేరుకోవచ్చుననే అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ అమెరికా తన కథనంలో అంచనా వేసింది. అయితే సంవత్సరపు చివరి మూడు నెలల్లో సగటున ఒక ఔన్స్ ధర 1800 డాలర్లుగా ఉండవచ్చునని పేర్కొంది. అంటే మన దగ్గర బంగారం ధరలు మళ్లీ రూ.50,000 దాటే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు.