ఏడాదిలో 20% పడిపోయిన బంగారం ధరలు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా?
గత ఏడాది కాలంలో బంగారం ధరలు దాదాపు 20 శాతం దిద్దుబాటుకు గురయ్యాయి. 2020 ఆగస్ట్ నెలలో రూ.56,200 వద్ద ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న పసిడి ధరలు ప్రస్తుతం రూ.47,000 వద్ద ఉన్నాయి. అంటే దాదాపు రూ.9000కు పైగా క్షీణించాయి. అంటే ఏడాది కాలంలో 19 శాతం మేర పతనమయ్యాయి. భారత దేశంలో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఆభరణంగా ఉపయోగించుకోవడంతో పాటు గత కొంతకాలంగా పెట్టుబడి సాధనంగా కూడా చూస్తున్నారు.
బంగారంపై పెట్టుబడులు ఎప్పటికి అప్పుడు పెరుగుతున్నాయి. గత ఏడాది ఆగస్ట్ నుండి కొద్ది నెలల పాటు ఇన్వెస్ట్ చేసిన వారికి చేదు అనుభవమే. కానీ పసిడి దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందిస్తుంది. 2020 ఏప్రిల్ నెలకు ముందు ఇన్వెస్ట్ చేసిన వారు భారీ రిటర్న్స్ పొందారని చెప్పవచ్చు. అంతేకాదు, కరోనా సెకండ్ వేవ్కు ముందు పసిడి ఓ సమయంలో రూ.44,000 దిగువకు, ఈ నెల ప్రారంభంలో రూ.46,000 దిగువకు కూడా పడిపోయింది. డాలర్ వ్యాల్యూ, కరోనా డెల్టా వేరియంట్, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల ప్రభావం పసిడి పైన ఉంటుంది. గత ఏడాది ఆగస్ట్ నుండి ఈ ఏడాది ఆగస్ట్ వరకు పసిడి దాదాపు 20 శాతం క్షీణించిన నేపథ్యంలో ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చా?
బంగారం మళ్లీ రూ.50,000 దాటుతుంది..
ప్రస్తుతం డెల్టా వేరియంట్ కేసుల నేపథ్యంలో బంగారం కాస్త పెరుగుతోంది. ఈ నెలలో నాన్-ఫామ్ పేరోల్స్ డేటా ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో బంగారం ధర ఎంసీఎక్స్లో 1700 డాలర్ల కంటే దిగువకు వస్తుందని అంచనాలు వేస్తున్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం విశ్లేషకులు బంగారం పెరుగుదల, డిమాండ్ పైన భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. బంగారం త్వరలో 1700 డాలర్ల దిగువకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి సమీప భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టేవారు కాస్త చూసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో గోల్డ్మన్ శాక్స్ మరోసారి బంగారం ఔన్స్ 2000 డాలర్లను దాటే అవకాశముందని, అది కూడా 2021 చివరి నాటికి ఈ మార్కుకు చేరుకోవచ్చునని అంచనా వేస్తోంది. అదే జరిగితే దేశీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ మళ్లీ రూ.50,000 పైకి చేరుకుంటుందని భావించవచ్చు.
బంగారం పాజిటివ్కు కారణాలు
- బంగారం ధరలు పెరుగుతాయని అంచనా వేయడానికి పలు కారణాలు చూపిస్తున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.
- డెల్టా వేరియంట్ కేసులు పెరగడం, ఆంక్షల నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది.
- చైనాలో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడ కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇది పెట్టుబడుల స్వర్గధామంగా భావించే బంగారానికి అనుకూలంగా మారుతుంది.
- ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీలు ఇటీవల కాలంలో సరికొత్త రికార్డుకు చేరుకొని, మంచి లాభాలను అందించాయి. డెల్టా వేరియంట్ లేదా కొత్త రికార్డుకు చేరుకున్న నేపథ్యంలో దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అప్పుడు పెట్టుబడిదారుల్లో రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అప్పుడు వారు బంగారం వైపు చూడవచ్చు.
బంగారంపై ఈ ప్రభావం
కరోనా మహమ్మారి రికవరీ పైన ప్రభావం చూపుతోంది. బంగారంతో పాటు క్రూడాయిల్ కూడా భూమిలో నుండి వస్తుంది. భూమిలో ఇవి పరిమితంగా ఉంటాయి. ఈ రెండు వస్తువుల ధరలు డాలర్లలో ఉంటాయి. అయితే కరోనా మహమ్మారి వంటి వివిధ కారణాల వల్ల డిమాండ్ తగ్గి క్రూడాయిల్ డిమాండ్ పడిపోతే బంగారం పెట్టుబడులు పెరగవచ్చు. అయితే భూమి నుండి దొరికే ఈ వస్తువు పరిమితం కాబట్టి దీర్ఘకాలంలో మాత్రం మంచి రిటర్న్స్ అందిస్తుంది. గత కొద్ది రోజులుగా డాలర్ ఇండెక్స్ లాభాల్లో ఉంది. నేడు 0.19 శాతం మేర క్షీణించి 93.32 డాలర్లకు తగ్గినప్పటికీ, డాలర్ మాత్రం గత కొద్ది సెషన్లుగా తొమ్మిది నెలల గరిష్టానికి చేరుకుంది.