గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి భారీగా పెట్టుబడులు, అందుకే.. : 25 ఏళ్ల కనిష్టానికి బంగారం డిమాండ్
2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో గోల్డ్ ఈటీఎఫ్లలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. కరోనా వైరస్, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడికి ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో (మూడు నెలల కాలంలో) గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF)లోకి రూ.2,426 కోట్ల నికర పెట్టుబడులు వచ్చినట్లు భారత్ మ్యూచువల్ ఫండ్స్ సంఘం (Amfi) తెలిపింది.
LTC క్యాష్ వోచర్ స్కీం: ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్
గోల్డ్ ఈటీఎఫ్లలోకి భారీ పెట్టుబడులు
2019 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ETFలోకి వచ్చిన ఫండ్స్ రూ.172 కోట్లు మాత్రమే. కానీ ఈ త్రైమాసికంలో రూ.2400 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లోకి రూ.5,957 కోట్ల నికర పెట్టుబడులు వస్తే ఇందులో గోల్డ్ ఈటీఎఫ్లదే అధికం. నెలవారీగా చూస్తే జనవరిలో గోల్డ్ ఈటీఎప్లలోకి రూ.202 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో ఇది రూ.1483 కోట్లుగా ఉంది. రూ.195 కోట్ల ఉపసంహరణలు జరిగాయి. ఏప్రిల్లో రూ.731 కోట్లు, మేలో రూ.815 కోట్లు, జూన్లో రూ.494 కోట్లు, జూలైలో రూ.921 కోట్లు, ఆగస్ట్లో రూ.908 కోట్లు, సెప్టెంబర్లో రూ.597 కోట్లు ఈటీఎఫ్లలోకి వచ్చాయి.
అందుకే బంగారంలో పెట్టుబడులు
గత ఏడాది కాలంగా బంగారు ఈటీఎఫ్ల ద్వారా వచ్చే పెట్టుబడులు పెరుగుతున్నాయని ఈ రంగం నిపుణులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో అధిక ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. వైరస్ నేపథ్యంలో మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయని, దీంతో సురక్షిత పెట్టుబడి వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. బంగారం వంటి సురక్షిత ఆస్తులపై పెట్టుబడులు పెరుగుతుంటాయని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరింత ఎక్కువగా ఉంటుంది.
అంతర్జాతీయ పరిణామాలు
గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న మొత్తం వ్యాల్యూ సెప్టెంబర్ 2020 నాటికి రూ.13,590 కోట్లు. 2019 సెప్టెంబర్ ముగిసే సమయానికి ఇది రూ.5,613 కోట్లుగా ఉంది. ఐరోపా, అమెరికా తదితర ప్రాంతాల్లో తిరిగి కరోనా కేసులు పెరుగుతున్నాయని, చాలా దేశాలు లాక్ డౌన్ను మళ్లీ విధిస్తున్నాయని, ఈ నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి పెరగవచ్చునని, గోల్డ్ ఈటీఎఫ్లలోకి పెట్టుబడులు మరింతగా పెరగవచ్చునని అంటున్నారు.
25 ఏళ్ల కనిష్టానికి బంగారం డిమాండ్
ఇదిలా ఉండగా దేశంలో బంగారం డిమాండ్ ఇటీవల 25 ఏళ్ల కనిష్టానికి చేరుకుంది. 2020లో మొదటి మూడు క్వార్టర్లలో బంగారం డిమాండ్ 252 టన్నులుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 496 టన్నులుగా ఉంది. 49 శాతం క్షీణించింది. 1995 తర్వాత దేశంలో గోల్డ్ డిమాండ్ ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. 1995లో గోల్డ్ డిమాండ్ 462 టన్నులుగా నమోదయింది. గత ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో 194 టన్నులుగా ఉంది. ప్రస్తుతం పండుగ సీజన్ నేపథ్యంలో చివరి త్రైమాసికంలో 200 టన్నులుగా నమోదయినా 452 టన్నులుగానే ఉంటుంది. అలా చూస్తే 1995 కంటే కనిష్టానికి పడిపోనుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో గోల్డ్ డిమాండ్ 30 శాతం పడిపోయి 86.6 టన్నులకు పరిమితమైంది.