ఈ వారం మార్కెట్లు ఎలా ఉండవచ్చు, బంగారం మరింత పెరిగేనా?
ముంబై: ఈ వారం స్టాక్ మార్కెట్లు ఊగిసలాటలో ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తన్నారు. గత మూడు వారాలుగా ప్రతి సోమవారం మార్కెట్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. దీంతో ఈసారి కూడా ఇదే జరగవచ్చుననే అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ డెరివేటివ్స్ సిరీస్ గడువు ఈ వారంలోనే ముగియనుండటంతో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు. బ్యాంకింగ్ రంగ షేర్లు సానుకూలంగా కదలాడవచ్చు. కరోనా ఉధృతి, పాక్షిక లాక్ డౌన్, ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్లు పతనమవుతున్నాయి. ఈ వారం కూడా అది కొనసాగి ఒడిదుడుకుల్లో ఉండవచ్చునని చెబుతున్నారు.
ఐటీ, సిమెంట్ పైన ప్రభావం
కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి ఈ వారం కదలాడవచ్చునని చెబుతున్నారు. రిఫైనరీలతో పోలిస్తే అప్ స్ట్రీమ్ కంపెనీలు బలంగా ఉన్నాయి. ఈవారం ఐటీ షేర్లు స్థిరీకరణకు గురికావొచ్చునని చెబుతున్నారు. 2021-22పై HCL టెక్నాలజీస్ ప్రకటించిన అంచనాలు ఆ కంపెనీ షేర్ల పైన ప్రభావం చూపవచ్చు. సెకండ్ వేవ్ కారణంగా డిమాండ్ తగ్గే అవకాశం ఉండటంతో సిమెంట్ కంపెనీల షేర్లు ఈ వారం నష్టపోవచ్చునని అంచనా వేస్తున్నారు.
ఇవి సానుకూలం
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఫార్మా షేర్లపై ఆసక్తి పెరిగే అవకాశమందని అంటున్నారు. బ్రిటానియా, హెచ్యూఎల్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీల ఫలితాల నుండి ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లు సంకేతాలు అందిపుచ్చుకుంటాయి. మెటల్, గనుల కంపెనీల షేర్లు కీలక సూచీలతో పోలిస్తే కాస్త సానుకూలంగా రాణించవచ్చు.
బంగారం, వెండి ధరలు
గోల్డ్ జూన్ కాంట్రాక్ట్ రూ.47,990, ఆ తర్వాత రూ.48,264 వద్ద నిరోధకం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే కాంట్రాక్ట్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. సిల్వర్ మే ఫ్యూచర్స్ రూ.67,335 వద్ద మద్దతు, రూ.66,595 వద్ద నిరోధకం కనిపిస్తోంది.