Invest in share market: మిడ్ క్యాప్లో 30%-40% వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు
కరోనా తర్వాత స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. 2022లోను కొత్తగా చాలామంది స్టాక్స్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2021లో స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. ఈ క్యాలెండర్ ఏడాదిలోను సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త గరిష్టాలను తాకవచ్చునని మార్కెట్ వర్గాల అంచనా. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ ఖాతా అవసరం. అయితే ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సంబంధించి వైవిధ్యంగా వెళ్లాలి. వివిధ రంగాలు, వివిధ స్టాక్స్ను ఎంచుకోవాలి. పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడ చిన్న సూచన...
ప్రస్తుతం మార్కెట్ ఊగిసలాటలో ఉంది. బడ్జెట్కు కొద్ది రోజుల ముందు భారీ దిద్దుబాటుకు గురయింది. బడ్జెట్కు రెండు రోజుల ముందు, ఆ తర్వాత రెండు రోజులు పరుగులు పెట్టింది. అనంతరం ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో మార్కెట్ నష్టపోయినప్పటికీ, మూడ్రోజులుగా కనిష్టాల వద్ద కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ఇటీవల మిడ్ క్యాప్ సూచీలు 15 శాతం నుండి 20 శాతం మేర క్షీణించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మిడ్ క్యాప్ ఇన్వెస్టర్లు వీటిలో 30 శాతం నుండి 40 శాతం కంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయవద్దని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
నిఫ్టీ దాదాపు ఏడు శాతం నుండి ఎనిమిది శాతం కరెక్షన్ కనిపిస్తోంది. చాలా వరకు స్టాక్స్ దిద్దుబాటుకు గురయ్యాయి. అయితే కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్ దాదాపు ఓ సంవత్సరం క్రితం స్థాయిలో ఉన్నాయి. అలాగే, ఆల్ టైమ్ గరిష్టం నుండి 20 శాతం నుండి 30 శాతం మధ్య క్షీణించాయి.