Dhanteras 2021: బంగారం, డైమండ్ జ్యువెల్లరీపై భారీ డిస్కౌంట్
దేశవ్యాప్తంగా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో అయితే ఐదు రోజులు నిర్వహిస్తారు. ఈ పండుగలోని మొదటి రోజును ధన త్రయోదశిగా పిలుస్తారు. దీనిని ధనతెరాస్ అంటారు. లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీ. క్షీరసాగర మదనంలో ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే ఈ రోజున బంగారం కొంటే శుభప్రదం అని భావిస్తారు. ధనతెరాస్ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇల్లు ఐశ్వర్యంతో కళకళలాడుతుందనే విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం ధనత్రయోదశి రోజున బంగారం, వెండి అమ్మకాలు జోరుగా సాగుతాయి. గత ఏడాది కరోనా కారణంగా బంగారం దుకాణాలు వెలవెలబోయాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి జ్యువెల్లరీ సంస్థలు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించాయి. తనిష్క్, పీసీ జ్యువల్లర్స్, సెంకో గోల్డ్ అండ్ డైమండ్, జోయ్ అలుక్కాస్ భారీ ఆఫర్లు ఇస్తున్నాయి.
తనిష్క్ ఆఫర్
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని తనిష్క్ జ్యువెల్లర్స్ ఆభరణాల తయారీ ఖర్చుల పైన 20 శాతం వరకు రాయితీని ఇస్తోంది. అక్టోబర్ 17వ తేదీన ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ రోజుతో ముగుస్తోంది.
పీసీ జ్యువెల్లర్స్
బంగారు నగల తయారీ ఖర్చుల పైన పీసీ జ్యువెల్లర్స్ 30 శాతం వరకు రాయితీని ఇస్తోంది. వెండి నగలు, వస్తువులపై కూడా రాయితీ ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోళ్లు చేసేవారు రూ.7.5 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అయితే కనీసం రూ.50,000 విలువ చేసే విధంగా కొనుగోలు చేయాలి. వివిధ క్రెడిట్ కార్డ్స్ పైన రూ.7500, డెబిట్ కార్డ్స్ పైన రూ.5000 వరకు క్యాష్ బ్యాక్ ఉంది. నవంబర్ 7వ తేదీ వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
జోయ్ అలుక్కాస్
రూ.25,000 విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేస్తే రూ.1,000 గిఫ్ట్ వోచర్ ఆఫర్ ఉంది. అక్కడి నుండి ప్రతి రూ.25 వేలకు ఒక గిఫ్ట్ వోచర్ ఇస్తారు. వెండిపై ప్రతి రూ.10,000, బంగారంపై ప్రతి రూ.50,000కు ఒక గిఫ్ట్ వోచర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ నవంబర్ 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
సెంకో గోల్డ్ అండ్ డైమాండ్
సెంకో గోల్డ్ అండ్ డైమాండ్ నగల కంపెనీ బంగారు ఆభరణాలపై ఒక్కో గ్రాముకు రూ.225 రాయితీ ఇస్తోంది. ఇందులో రూ.100 నగదు రాయితీ కాగా మరో రూ.125 విలువ చేసే వెండి వస్తువులను ఆఫర్ కింద ఇస్తోంది. బంగారు ఆభరణాలపై తయారీ ఛార్జీలను ఎత్తివేశారు. వజ్రాభరణాల తయారీపై 75 శాతం వరకు రాయితీ ఉంది. ఇవి పరిమిత కాల ఆఫర్లు.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్
రూ.30,000 విలువ చేసే గోల్డ్ జ్యువెల్లరీ కొనుగోలు చేస్తే ఒక గ్రాము బంగారు నాణేన్ని ఆఫర్ చేస్తున్నారు. అక్కడి నుండి ప్రతి రూ.30 వేల కొనుగోలుపై ఒక నాణెం లభిస్తుంది. జ్యువెల్లరీ విషయానికి వస్తే ప్రతి రూ.30,000 కొనుగోలుపై రెండు బంగారు నాణేలు ఇస్తున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు కస్టమర్లకు మరో అయిదు శాతం అదనపు క్యాష్బ్యాక్ లభిస్తోంది.