7 నెలల్లో బిగ్గెస్ట్ మార్కెట్ క్రాష్, రూ.8 లక్షల కోట్లు ఆవిరి: నేడు ఈ స్టాక్స్ ర్యాలీ చేసే ఛాన్స్
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (నవంబర్ 22) భారీగా నష్టపోయాయి. గడిచిన ఏడు నెలల్లో మార్కెట్కు అత్యంత భారీ పతనం ఇది. సెన్సెక్స్ 1,170 పాయింట్లు, నిఫ్టీ 348 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ ఓ సమయంలో 1600 పాయింట్ల వరకు క్షీణించినప్పటికీ ఆ తర్వాత కాస్త కుదురుకుంది. అయినప్పటికీ ఏడు నెలల్లో మొదటిసారి భారీ నష్టాలను నమోదు చేశాయి. దేశీయంగా కంపెనీల ఫలితాల సీజన్ ముగియడం, అంతర్జాతీయ మార్కెట్ నుండి ప్రతికూల సంకేతాలు, ఇటీవలి గరిష్టం నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ కొనసాగడం, ఐరోపా దేశాల్లో కరోనా కేసులు పెరగడం, వివిధ దేశాల్లో లాక్ డౌన్ విధింపు, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భణ భయాలు, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు మార్కెట్ నష్టాలకు కారణాలు. రిలయన్స్ - ఆరామ్కో ఒప్పందానికి చెక్ పడిన నేపథ్యంలో రిలయన్స్ షేర్ నిన్న నాలుగు శాతానికి పైగా పడిపోయింది.
రూ.8 లక్షల కోట్ల సంపద హుష్కాకి
ఏప్రిల్ 12(1708 పాయింట్లు) తర్వాత ఇన్వెస్టర్లు మొదటిసారి రూ.8 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. అన్ని రంగాల స్క్రిప్ట్స్ భారీ నష్టాలను నమోదు చేశాయి. సాగు చట్టాల ఉపసంహరణ ప్రభుత్వరంగ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపించింది. సూచీల పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని లిస్టెడ్ సంస్థల మార్కెట్ వ్యాల్యూ రూ.8.21 లక్షల కోట్లు తగ్గి రూ.260.98 లక్షల కోట్లకు పడిపోయింది. నిన్న రోజంతా అమ్మకాలు కొనసాగడంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి సూచీలు.
ఆరామ్కోతో డీల్ రద్దు నేపథ్యంలో రిలయన్స్ స్టాక్ ఓ సమయంలో 4.92 శాతం నష్టపోయింది. చివరకు 4.42 శాతం నష్టంతో రూ.2363 వద్ద ముగిసింది. పేటీఎం నష్టాలు రెండో రోజు కొనసాగాయి. నిన్న 13 శాతం నష్టపోయింది. ప్రీపెయిడ్ టారిఫ్స్ పెంపు నేపథ్యంలో ఎయిర్టెల్ స్టాక్ 3.90 శాతం మేర లాభపడింది.
ఐపీవోలకు షాక్
నవంబర్ నెలలో వచ్చిన ఐపీఓలు ఇన్వెస్టర్లకు మిశ్రమ ఫలితాలిచ్చాయి. అయితే అతిపెద్ద ఐపీవో పేటీఎం అయితే అన్నింటి కంటే ఎక్కువ నష్టాలను ఇచ్చి, ఇన్వెస్టర్లకు 36 శాతం నష్టాలను ఇచ్చింది. ఇప్పటి వరకు 7 కంపెనీలు నమోదయ్యాయి. ఇందులో 4 కంపెనీల షేర్లు ఇష్యూ ధర కంటే దిగువన ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ భారీ దిద్దుబాటు, ఐపీవో ఇష్యూ సైజ్ అధిక వ్యాల్యూతో ఉండటం వంటి అంశాలు ప్రభావం చూపాయి. ప్రస్తుతం వన్97 కమ్యూనికేషన్స్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, సాఫైర్ ఫుడ్స్, ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ షేర్లు ఇష్యూ ధర దిగువకు చేరాయి. పాలసీ బజార్ ఫిన్టెక్ (పాలసీబజార్), ఎఫ్ఎస్ఎన్ ఇ-కామర్స్ (నైకా), సిగాచీ ఇండస్ట్రీస్ మాత్రం ఇన్వెస్టర్లకు లాభాలను ఇచ్చాయి.
ఈ స్టాక్స్ ర్యాలీ చేసే అవకాశం
నిన్నటి భారీ నష్టాల అనంతరం నేడు పలు స్టాక్స్ ర్యాలీ చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు స్టాక్ మార్కెట్ నిపుణులు రవి సింఘాల్, రవి సింగ్, రోహిత్ సింగ్రే తదితరులు నాలుగు స్టాక్స్ సూచిస్తున్నారు. అశోక్ లేలాండ్, హావెల్స్ ఇండియా, డీఎల్ఎఫ్, ఎన్ఆర్బీ బేరింగ్స్ వంటివి ర్యాలీ చేయవచ్చునని అంటున్నారు.
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టుబడి రిస్క్తో కూడిన అంశం. కాబట్టి నిపుణుల సలహాలు, స్టాక్ మార్కెట్, స్టాక్స్ పైన పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయాలి.