62,000కు సమీపంలో సెన్సెక్స్, జాగ్రత్త... మార్కెట్ పరుగుతో వెళ్లవద్దు!!
స్టాక్ మార్కెట్లు సోమవారం (అక్టోబర్ 18) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా ఏడో రోజు లాభపడింది. నేడు 460 పాయింట్ల మేర లాభాల్లో ముగిసింది. ఓ సమయంలో 62,000 పాయింట్లకు చేరువైంది. ఆల్ టైమ్ గరిష్టం కూడా ఇదే. అంతర్జాతీయ మార్కెట్ మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ సానుకూలతలు సూచీలను ముందుకు నడిపించాయి. ద్రవ్యోల్బణం తగ్గడం, వృద్ధి రేటు, ఆయా కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ఫెస్టివెల్ సీజన్లో డిమాండ్ పుంజుకోవడం, వ్యాక్సినేషన్, కరోనా అదుపులో ఉండడం వంటి అంశాలు సూచీల పరుగుకు కారణమయ్యాయి. అలాగే కీలక రంగాల్లో కొనుగోళ్లు సూచీల పరుగుకు దోహదం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సూచీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించిందనే వార్తల నేపథ్యంలో ఆసియా-పసిఫిక్ సూచీలు మిశ్రమంగా కదలాడాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. బ్యాంకులు, మెటల్ సూచీల సెన్సెక్స్ జంప్కు దోహదపడ్డాయి.
నిన్నటి స్థాయితో ఏ సమయంలోనైనా 320 పాయింట్ల పైనే
సెన్సెక్స్ ఉదయం 61,817.32 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,963.07 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 61,624.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,500.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,543.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,445.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 459.64 (0.75%) పాయింట్లు లాభపడి 61,765.59 పాయింట్ల వద్ద, నిఫ్టీ 138.50 (0.76%) పాయింట్లు ఎగిసి 18,477.05 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టం 61,963 పాయింట్లను తాకి... 62,000 పాయింట్లకు 37 పాయింట్ల దూరం వరకు వెళ్లి కాస్త వెనక్కి వచ్చింది. నేడు సెన్సెక్స్ 340 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. క్రితం సెషన్లో 61,305 పాయింట్ల వద్ద ముగిసినప్పటికీ, 500 పాయింట్లకు పైగా లాభంతోనే ప్రారంభమైంది. నేటి కనిష్టం 61,624 పాయింట్లు. ఏ దశలోను నిన్నటి ముగింపు స్థాయికి రాలేదు. నిన్నటితో పైగా 320 పాయింట్లకు పైనే కదలాడింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 5.17 శాతం, ఇన్ఫోసిస్ 4.45 శాతం, టెక్ మహీంద్రా 3.41 శాతం, JSW స్టీల్ 3.31 శాతం, టాటా స్టీల్ 2.62 లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HCL టెక్ 2.38 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.20 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.71 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.64 శాతం, బ్రిటానియా 1.48 శాతం నష్టపోయాయి.
అప్ ట్రెండ్ కానీ.. అప్రమత్తం
సెన్సెక్స్ ఇటీవల పరుగులు పెడుతోంది. మార్కెట్ జోరు గత కొద్దికాలంగా కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్ వార్తల నేపథ్యంలో మార్కెట్లో అప్ ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నప్పటికీ, అప్రమత్తంగా ఉండాలని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిక్ వీకే విజయ్ కుమార్ అన్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ప్రస్తుత పరిస్థితుల వెంటపడకూడదని, అధిక వ్యాల్యూ కలిగిన స్టాక్స్కు కాస్త దూరం పాటించాలని సూచిస్తున్నారు. వీటికి బదులు అధిక నాణ్యత కలిగిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. గత గురువారం రూ.1682 కోట్ల FIIలు బలమైన మద్దతును ఇస్తోందన్నారు.