మధ్యతరగతి వారు మీ డబ్బులను ఈ పెట్టుబడులలో పెట్టండి లాభాలు ఖాయం!
మధ్యతరగతి వారు కూడా పైసా పైసా కూడబెట్టి ధనవంతులు అవ్వొచ్చు. అయితే వారు తమ పెట్టుబడులను దీర్ఘకాలంపాటు సురక్షితమైన వాటిలో పెడితేనే ఇది సాధ్యం. సురక్షితమైన పథకాల్లో పెట్టిన పెట్టుబడి కోల్పోయే ప్రమాదం దాదాపు ఉండదు. పదవీ విరమణ పొందినవారికి, ఎలాంటి రిస్క్ తీసుకోలేనివారికి సురక్షితమైన పథకాలు మంచివి. పెట్టుబడుల విషయంలో చాలా మంది రిస్క్ తీసుకునే పరిస్థితి ఉండదు. వారి అభిరుచులకు అనుగుణంగానే మన దేశంలో ఇలాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఆసక్తికరమైన విషయాలు క్లుప్తంగా తెలుసుకుందామా మరి
2. ప్రజా భవిష్య నిధి:
ఉద్యోగులకు అత్యంత ప్రీతిపాత్రమైనది ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్) పథకం. దీంతో చాలానే ప్రయోజనాలున్నాయి. ఈ ఆదాయంపై వచ్చే వడ్డీకి ఎలాంటి పన్ను వర్తించదు. ఇక రెండోది .. సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. పదవీ విరమణకు అనుకూలమైన పథకమిది. వడ్డీ రేటు మాత్రం 9 శాతం నుంచి 7.9శాతానికి పడిపోవడం విచారకరం. మరింత తగ్గే సూచనలు లేకపోలేదు. దీర్ఘకాలంలో పెట్టుబడి చేసేవారైతే దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. మన దేశంలో అత్యంత సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో దీనికి అగ్రస్థానం ఉంది. పదవీ విరమణకు నిధి సృష్టించుకునేందుకు ఈ పథకం ఎంతో అనుకూలమైంది. ఒకే ఒక్క అంశం పీపీఎఫ్ కు ప్రతికూలంగా ఉంది. అదేమిటంటే దీని లాకిన్ పీరియడ్. ఇది ఆరేళ్లు ఉంది. ఈ కాలవ్యవధిలో ఇందులోంచి సొమ్మును విత్ డ్రా చేసుకోలేం.
1. నెలవారీ ఆదాయ పథకం:
తక్కువ రిస్క్ ఉండాలి, మంచి రాబడి రావాలి, సురక్షితమైన పెట్టుబడి మార్గం ఉండాలి, ప్రభుత్వ ఆధీనంలో ఉండితీరాలి.. ఈ లక్షణాలన్నీ దేనికున్నాయంటే టక్కున పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం గుర్తుకొస్తుంది. అయితే ఈ పథకం పెద్దగా ప్రయోజనకారి కాదంటారు నిపుణులు. ప్రజా భవిష్య నిధితో పోలిస్తే తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. పైగా పన్ను వర్తిస్తుంది. వాస్తవంగా అందుకునే రాబడి తక్కువే ఉంటుంది. ఈ పథకంలో పెట్టినవారు మరింత మంచి రాబడిని ఆశిస్తున్నట్టయితే ఇతర మార్గాలను ఆశ్రయించవచ్చు. ప్రస్తుతానికి పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం 7.6శాతం వడ్డీనిస్తోంది. మరీ తక్కువేం కాదు! ఫర్వాలేదు. మన దేశంలో అత్యంత సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో ఇదీ ఒకటి. స్వయాన భారత ప్రభుత్వమే దీనికి హామీ ఇస్తోంది.
3. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ :
వయో వృద్ధుల సంక్షేమానికి మన ప్రభుత్వం వివిధ రంగాల్లో అనేక చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వమే వడ్డీరేటును నిర్ణయించి ప్రతి మూడు నెలలకోసారి సవరణ చేస్తుంది. ఒకప్పుడు 10శాతంగా ఉండే వడ్డీ ఇప్పుడు 8.4శాతానికి చేరాయి. ఈ పథకాన్ని పోస్టాఫీసుతో పాటు ఐసీఐసీఐ, ఎస్బీఐ లాంటి బ్యాంకుల ద్వారా కూడా ప్రారంభించవచ్చు. పేరుకు తగ్గట్టుగానే ఈ పథకం కేవలం పెద్దలకు ఉద్దేశించింది మాత్రమే. ఈ పథకం పెద్దలకు కాబట్టి వచ్చే రాబడిపై పన్ను ఆదా ప్రయోజనాలు ఉంటాయనుకుంటే పొరబడినట్టే. దీనికి కాంట్రవర్సీగా ఎలాంటి పన్ను ప్రయోజనాలు లేవు. ఈ డిపాజిట్లపై టీడీఎస్ వర్తిస్తుంది. క్రమమైన కాలవ్యవధుల్లో ఈ పథకాలపై ప్రభుత్వం వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది.
4. సుకన్య సమృద్ధి యోజన:
ఆడపిల్లలను చదువుకునేలా ప్రోత్సహించేందుకు సుకన్య సమృద్ధి యోజనను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఖాతాను ఏదేని పోస్టాఫీసులో లేదా వాణిజ్య బ్యాంకుల్లో ప్రారంభించవచ్చు. సుకన్య సమృద్ధి ఖాతాలో డబ్బులు పెట్టడం వల్ల అనేక ఉపయోగాలున్నాయి. తొలి ప్రయోజనంగా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. రెండో ప్రయోజనంగా ఆడపిల్లల పేరిట నిధి జమచేయవచ్చు. దీర్ఘకాల పెట్టుబడిదారు అయితే ఇది చాలా మంచి పథకం. ఇది మరీ దీర్ఘకాలంపాటు కొనసాగించాల్సి వస్తుంది అదే దీంతో పెద్ద ఇబ్బంది. ప్రస్తుతానికి ఈ పథకంపై వార్షికంగా 8.4శాతం వడ్డీనందిస్తున్నారు. ఇతర పోస్టాఫీసు పథకాల మాదిరిగా వీటి వడ్డీ రేట్లలో ప్రభుత్వం సవరణలు చేస్తూనే ఉంటుంది.
5. డెట్ మ్యూచువల్ ఫండ్లు:
5. డెట్ మ్యూచువల్ ఫండ్లు:బ్యాంకు డిపాజిట్ల కంటే మెరుగైన రాబడులను డెట్ మ్యూచువల్ ఫండ్లు అందించగలవు. దీంట్లోని సొమ్మును కొంత ఈక్విటీల్లోనూ పెడతారు. డెట్ మ్యూచువల్ ఫండ్లు సురక్షితమైనవి ఎందుకంటే వీటిలో కొంత సొమ్మును కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల లాంటివాటిలో పెట్టి లాభాలను గడించి అవి ఫండ్లో పెట్టుబడి పెట్టేవారికి అందజేస్తారు. స్వల్పకాలానికి లేదా దీర్ఘకాల అవసరాలకు డెట్ మ్యూచువల్ ఫండ్లు సరిపోతాయి.
6. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లు:
ఇలాంటి పథకాల్లో పెట్టుబడులతో సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా ప్రయోజనాలను పొందవచ్చు. పెట్టుబడిపై వడ్డీ రూపంలో ఆదాయం సంవత్సరానికి రూ.10వేలు దాటితే మాత్రం టీడీఎస్ విధిస్తారు. పాన్ కార్డు ఇస్తే 10శాతమే పన్ను పడుతుంది. లేదా 20శాతం టీడీఎస్ విధిస్తారు. ఈ డిపాజిట్లపై వడ్డీ 6 నుంచి 7శాతం మధ్యలో ఉంటాయి. ఇటీవలే బాగా తగ్గాయి.
7. ఎంపిక చేసిన కంపెనీ డిపాజిట్లు:
కంపెనీ డిపాజిట్లు కూడా సురక్షితమైన పెట్టుబడి పథకాలే. AAA రేట్ ఉన్న డిపాజిట్లు సురక్షితమైనవి. ఉదాహరణకు బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్స్ లాంటివి AAA రేట్ ఉన్న డిపాజిట్లను అందిస్తాయి. బ్యాంకు డిపాజిట్ల కంటే కాస్త మెరుగైన వడ్డీ రేట్లను ఇవి అందిస్తుంటాయి. బ్యాంకులతో పోలిస్తే కనీసం 1శాతం అధికంగా వడ్డీని ఇస్తాయి. అయితే ఇలాంటివి కాస్త రిస్క్ తో కూడుకున్నవి.
8. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్:
వీటి కాలవ్యవధి సాధారణంగా ఏడాది లోపే ఉంటుంది. సురక్షితమైన మ్యూచువల్ ఫండ్ రకాల్లో ఇవీ ఒకటి. ఇందులో మదుపరుల సొమ్మును AAA రేటు ఉన్న సాధనాల్లో పెట్టుబడి పెడతారు. ఏడాదిపాటు పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇవి అనుకూలం. లాభాలు ఫర్వాలేదు. అయితే ఇవి పన్ను ఆదా పథకాలు కావు. కాబట్టి వాస్తవ రాబడులు చాలా తగ్గవచ్చు.
9. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లు:
సురక్షితమైన పెట్టుబడి మార్గం గురించి ఆలోచించేవారు పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లను పరిశీలించవచ్చు. ఈ మధ్య కాలంలోనే వడ్డీ రేట్లు పడిపోయాయి. అయితే దీర్ఘకాలానికి సంపద సృష్టించుకోవాలంటే మాత్రం ఇది చాలా మంచి పథకం. అయితే ఈ పథకంలో అందుకునే ఆదాయానికి పన్ను వర్తిస్తుంది. ఇదొక్కటే దీనికున్న ప్రతికూలత. అయిదేళ్ల పాటు స్థిరంగా వీటిలో పెట్టుబడి పెడితే మంచి లాభం వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు ఈ పథకం మంచి అవకాశం.
10. మ్యూచువల్ ఫండ్లలో ఎంఐపీలు:
డెట్ మ్యూచువల్ ఫండ్లలో సురక్షితమైనవి మంత్లీ ఇన్కమ్ ప్లాన్లు. వీటిలోని సొమ్మును ఎక్కువగా ప్రభుత్వ పథకాల్లో లేదా అధిక రేటు ఉండే డెట్ మ్యూచువల్ ఫండ్లలో పెడతారు. కాబట్టి ఇవి సురక్షితమని చెప్పొచ్చు. దీర్ఘకాల పెట్టుబడిదారు అయితే ఎంఐపీలను పరిశీలించవచ్చు. గతంలో ఈ పథకాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తిన దాఖలాలు లేవు. కొన్ని సార్లు వీటిలో ఈక్విటీ, డెట్ మిశ్రమంగా పెట్టుబడులు పెడతారు. దీంతో అధిక రాబడులు వచ్చేలా చేస్తారు. కొన్ని ఎంఐపీలు గత ఏడాది కాలంలో 10శాతం దాకా రాబడినిచ్చాయి.