ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ప్రతి వ్యక్తి పొదుపు మంత్రం పాటించాల్సిందే. ఎక్కువ మంది పొదుపు, పెట్టుబడుల కోసం సురక్షిత పథకాల వైపే చూస్తారు. 3 నుంచి 5 ఏళ్ల పాటు వరుసగా డబ్బు అవసరం లేదనుకుంటే ఎఫ్డీల వైపే మొగ్గుచూపుతారు. కేంద్రం, బ్యాంకులు పలు పొదుపు పథకాల వడ్డీ రేట్లు తగ్గిస్తున్న క్రమంలో పోస్టాఫీసు పొదుపు పథకాలు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నాయి. ఈ క్రమంలో వివిధ పోస్టాఫీసు పొదుపు పథకాల గురించి తెలుసుకుందాం.

1. పోస్టాఫీసు పొదుపు ఖాతా:
దేశంలో పౌరులెవరైనా ఈ ఖాతాను తెరవచ్చు. కనీసం రూ. 20 తో ఖాతా ప్రారంభించవచ్చు. చెక్కు సదుపాయం అవసరం లేని ఖాతాలకైతే కనీస నిల్వ రూ. 50 గాను, చెక్కు సదుపాయం గల ఖాతాకు కనీస నిల్వ రూ. 500 గాను ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఖాతాకు సైతం చెక్కు సదుపాయాన్ని పొందవచ్చు. సీబీఎస్ సదుపాయం ఉన్న వాటికి ప్రస్తుతం ఏటీఎమ్ సదుపాయాన్ని సైతం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాతాలో నిల్వపై 4% వార్షిక వడ్డీ చెల్లిస్తారు.

2. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్:
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ కనీసం రూ. 10 నిల్వతో పోస్టాఫీసు ఆర్డీనీ మొదలుపెట్టవచ్చు. రూ. 5 మొత్తాల్లో ఎంతైనా పొదుపు చేసుకోవచ్చు. ఖాతాను నగదు లేదా చెక్కు ద్వారా తెరిచే వీలుంది. ఖాతా తెరిచేటప్పుడే నామినీని నియమించుకోవచ్చు. 2017 ఏప్రిల్ 1 నుంచి ఈ ఖాతాలకు 7.2 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. ఏడాది తర్వాతి నుంచి 50 శాతం విత్డ్రాయల్కు అనుమతిస్తారు. ఒకవేళ డిపాజిట్ను చెక్కు ద్వారా చేస్తే, ప్రభుత్వ ఖాతాలోకి జమ అయిన రోజునుంచి డిపాజిట్ను ప్రామాణిక తేదీగా తీసుకుంటారు. ఈ రికరింగ్ డిపాజిట్ కాలపరిమితి 5 సంవత్సరాలు.

3. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్:
పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ (కాలపరిమితి డిపాజిట్) వార్షికంగా వడ్డీని చెల్లించినా త్రైమాసికానికి ఒకసారి వడ్డీని లెక్కిస్తారు. కనీసం రూ. 200 తో ఖాతాను ప్రారంభించవచ్చు. మైనర్ పేరిట సైతం ఖాతను తెరవొచ్చు. ఇద్దరూ మేజర్లయిన క్రమంలో ఉమ్మడి ఖాతా తెరిచే వీలుంది. సీబీఎస్ సౌకర్యం ఉన్న పోస్టాఫీసులో తెరిచిన టైమ్ డిపాజిట్ ఖాతాలు మెచ్యూర్ అయిన తర్వాత ఆటో రెన్యువల్ అవుతాయి. అంటే రెండేళ్ల టైమ్ డిపాజిట్ను తెరిచారనుకుంటే, మెచ్యూరిటీ ముగిసిన తర్వాత మళ్లీ రెండేళ్లకు ఆటో రెన్యువల్ అవుతుంది. ఒకవేళ మెచ్యూరిటీ అయిన వెంటనే తీసుకుంటే మొదట చేసిన కాలపరిమితికి వడ్డీ చెల్లిస్తారు. ఏడాది, రెండేళ్ల, మూడేళ్ల, నాలుగేళ్ల, ఐదేళ్ల కాలవ్యవధి కలిగిన టైమ్ డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి. ఏడాది డిపాజిట్లకు 6.9% శాతం, 24 నెలల డిపాజిట్కు 7.0%, 3 ఏళ్ల డిపాజిట్లకు 7.2%, 5 ఏళ్ల డిపాజిట్లకు 7.7శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి

4. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం:
పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం ప్రతి నెలా ఆదాయం కావాలనుకునేవారికి ఈ పథకం సరిపోతుంది. ఈ పథకం ఒకరి పేరిట గరిష్టంగా ఒక ఖాతాలో ఒకేసారి రూ. 4.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఉమ్మడి ఖాతాలో అయితే రూ. 9 లక్షలు పరిమితి. మెచ్యూరిటీ 5 ఏళ్లు. 2017 ఏప్రిల్ 1 నుంచి వార్షిక వడ్డీ 7.60 శాతంగా ఉంది. స్థిరమైన ఆదాయం లేనివారు ఈ పథకంలో చేరడం వల్ల నెలవారీ క్రమమైన ఆదాయం పొందవచ్చు. ఈ పథకం కాలపరిమితి ఐదు సంవత్సరాలు. ఒకసారి ఈ పథకంలో చేరిన తర్వాత ఏడాది గడిచిన తర్వాత మాత్రమే విత్డ్రాయల్కు అనుమతిస్తారు. ఏడాది నుంచి మూడేళ్ల లోపు విత్డ్రా చేసుకునే ఖాతాలకు డిపాజిట్ విలువలో 2 శాతాన్ని తగ్గించి ఇస్తుండగా, 3 ఏళ్ల తర్వాత నుంచి విత్డ్రా చేసుకునే వారికి డిపాజిట్లో 1 శాతం తగ్గించి ఇస్తున్నారు. మీకు కావలసిన క్రమమైన వడ్డీని నేరుగా పోస్టాఫీసు పొదుపు ఖాతాలోనే పొందవచ్చు

5. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్(ఎన్ఎస్ఎస్):
ఇందులో రూ. 100 కనిష్ట మొత్తంతో పొదుపు ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఈ డిపాజిట్లు ఆదాయపు పన్ను చట్టం 80 సీ కింద పన్ను మినహాయింపులు కలిగి ఉన్నాయి. దీనిపై వార్షిక ప్రాతిపదికన వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సాధారణ పరిస్థితులలో గడువు తీరక ముందే పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు వీల్లేదు. ఖాతాదారుడు చనిపోయినప్పుడు ఖాతాను మూసివేయవచ్చు. ప్రస్తుతం 5 ఏళ్ల ఎన్ఎస్సీలను 8వ ఇష్యూలో జారీచేస్తున్నారు. వీటిని జారీచేసినప్పటి నుంచి మెచ్యూరిటీ తీరేలోగా ఒకసారి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరిట బదిలీ చేసుకోవచ్చు. 2017 ఏప్రిల్ 1 నుంచి 7.9 శాతం వడ్డీ వర్తిస్తోంది.

6. కిసాన్ వికాస్ పత్ర(కేవీపీ):
113 నెలల(9 ఏళ్ల 5 నెలల) కాలంలో కిసాన్ వికాస పత్రలో పెట్టిన పెట్టుబడి రెండింతలవుతుంది. ఇవి రూ. వేయి, 5 వేలు, పది వేలు, 50 వేల మొత్తాల్లో అందుబాటులో ఉంటాయి. కనీసం రూ. 1000 తో మొదలుకొని ఎంతవరకైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఏ పోస్టాఫీసు శాఖలోనైనా వీటిని కొనుగోలు చేయవచ్చు. నామినీని నియమించుకునే సౌకర్యం ఉంది. ఒక పోస్టాఫీసు నుంచి మరొక పోస్టాఫీసుకు, ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు ఈ పత్రాలను బదిలీ చేసుకోవచ్చు.

7. 15 ఏళ్ల ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్):
దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక ఉండి, రిస్క్ తీసుకోలేని వారికోసం ఉద్దేశించింది పీపీఎఫ్. వేతన జీవులకు, సొంత వ్యాపారం నిర్వహించుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉండగలదు. దీర్ఘకాలిక పెట్టుబడి ఆలోచన ఉన్నవారు మాత్రమే ఇందులో చేరాలి. మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు కాగా ముందస్తు మూసివేతకు అవకాశం లేదు. 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత కావాలనుకుంటే మరో 5 ఏళ్లు ఖాతాను కొనసాగించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 80సీ పన్ను మినహాయింపునకు అవకాశం కలదు. వడ్డీ సైతం పన్ను మినహాయింపునకు అర్హత సాధిస్తుంది. పెట్టుబడి పెట్టిన మూడో ఏట నుంచి రుణం పొందే సదుపాయం ఉంది. 2017 ఏప్రిల్ 1 నుంచి వార్షిక వడ్డీ 7.90 శాతంగా మారింది. ఏ విధంగా చూసినా రిస్క్ తీసుకోలేని వారికి దీని వడ్డీ ఆకర్షణీయంగానే ఉంటుంది.

8. సుకన్య సమృద్ది ఖాతా
ఏప్రిల్ 1 నుంచి వార్షిక వడ్డీ 8.40% కనీస నిల్వ రూ. 1000 తో ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఏడాదికి రూ. 1.50 లక్ష వరకూ ఖాతాలో జమ చేయవచ్చు. కూతురు పేరిట తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ ఖాతాను తెరవొచ్చు. ఆడపిల్ల పుట్టిన తేదీ నుంచి 10 ఏళ్ల లోపే ఈ ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఏడాదిలో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయకపోతే, ఖాతాను ఆపేస్తారు. మళ్లీ కొనసాగించేందుకు ఏడాదికి రూ. 50 పెనాల్టీ చెల్లించాలి. అమ్మాయికి 21 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఖాతాను మూసేయవచ్చు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా పెళ్లి అయ్యే సందర్భాల్లో మాత్రమే ముందస్తుగా ఖాతాను మూసివేసేందుకు అవకాశం కల్పిస్తారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications