2016లో సంపదను పెంచుకునే ఉత్తమ మార్గాలు
2015 ఆరంభంలో ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్స్ అద్భుతమైన రీతిలో పయనించి 15 శాతం రాబడులను ఇస్తాయని మార్కెట్ నిపుణలు అంచనా వేశారు. కానీ వాస్తవానికి మార్కెట్ 6 శాతం నష్టపోయింది. ఇంకా చెప్పాలంటే 2014లో ఒకటి లేదా రెండు సంవత్సరాల కాలపరిమితికి పెట్టుబడులు పెట్టిన వారంతా నష్టపోయారు.
సేవింగ్స్ ఖాతాల్లో లభించే వడ్డీకి సమానమైన రాబడి కూడా రాలేదు. అదే 5-6 ఏళ్ల కాలపరిమితికి పెట్టుబడి పెట్టిన నిధులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఫిక్సెడ్ డిపాజిట్లపై 8.5 శాతం రాబడి అందగా, బంగారం ధరలు 5.3 శాతం తగ్గాయి.
నిర్మాణ రంగం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సగటున ఇంటి ధరలు 3.5 శాతం పతనమయ్యాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాదిలో పెట్టుబడులు ఏ రంగాల్లో పెడితే మంచిదనే విషయమై 'ఎకనామిక్ టైమ్స్ వెల్త్' ఓ సర్వేను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వారిలో 95 శాతం మంది సంపద సృష్టికి 2016 ఉత్తమ సంవత్సరంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఎన్పీఎస్ అకౌంట్
నేషనల్ పెన్షన్ స్కీంలో కొత్తగా ఖాతాను ప్రారంభించడం ద్వారా ఏడాదికి రూ. 50 వేల పన్ను రాయితీతో పాటు వడ్డీ రాబడి కూడా ఉంటుంది. ఎన్పీఎస్ ఖాతా ప్రారంభం అత్యుత్తమమని 19.1 శాతం మంది, మంచిదని 44.7 శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ ఖాతాలపై 8 శాతం వడ్డీ (సంవత్సరాంతానికి చక్రవడ్డీ) లభిస్తుంది. ఓ పదిహేనేళ్లు ఖాతాను కొనసాగిస్తే, సాలీనా సగటున 10 శాతం వృద్ధి సాధ్యమేనని నిపుణులు వెల్లడించారు.
ఈ వాలెట్
2016 సంవత్సరం ఖచ్చితంగా ఈ వాలెట్ విధానానిదే. 11 విభాగాల్లో పేమెంట్ బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆన్లైన్ కొనుగోళ్లు, బిల్లు చెల్లింపులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాల మోసాలు జరుగకుండా ఈ వాలెట్ సహకరిస్తుందని అంచనా. ఇప్పటికే పేటీయం, పేయూ, మొబీక్విక్ వంటి సంస్థలు ఆకర్షణీయ క్యాష్ బ్యాక్లతో ఈ వాలెట్ సేవలు అందిస్తున్నాయి. ఇక ఈ విధానంలో బిల్లు చెల్లింపులు జరిపితే లాభాలూ ఉంటాయి. మొబైల్ రీచార్జి, విద్యుత్, డీటీహెచ్, గ్యాస్, నిత్యావసరాలు, క్యాబ్ బుకింగ్స్, ఆన్ లైఫ్ ఫుడ్ ఆర్డర్లు, సినిమాలు తదితరాలకు నెలకు రూ. 12,500 వరకూ ఖర్చు పెడతారని భావిస్తే, ఈ-వాలెట్ వినియోగిస్తే, రూ. 1,395 వరకూ ఆదా అవుతుంది. సంవత్సరంలో ఆ మొత్తం రూ. 15 వేలకు పైగా మిగుల్చుకోవచ్చు. ఈవాలెట్ ప్రారంభం అత్యుత్తమమని 21.3 శాతం మంది, మంచిదని 44.7 శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు.
మ్యూచువల్ ఫండ్స్
స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్ను నమ్ముకోవడం అత్యుత్తమమని 6.4 శాతం మంది, మంచిదని 29.8 శాతం మంది, ఫర్వాలేదని 31.9 శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. 15 క్రితం మ్యూచువల్ ఫండ్స్లో రూ. లక్ష పెట్టిన వారికి ఈ సంవత్సరం రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల ఆదాయం చేతిలో ఉందని తెలిపారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టినా, అదే విధమైన ఆదాయాన్ని భవిష్యత్తులో అందుకోవచ్చని సూచించారు.
ఫిక్సెడ్ డిపాజిట్ల స్థానంలో డెట్ఫండ్స్
తక్కువ వడ్డీలను ఇచ్చే బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్లతో పోలిస్తే, 2016 డెట్ ఫండ్స్ వల్ల మరింత ప్రయోజనం చేకూరుస్తుందని ఎక్కువ మంది అంచనా వేశార. డెట్ ఫండ్స్ పెట్టుబడులు అత్యుత్తమమని 31.9 శాతం మంది, మంచిదని 40.4 శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు డెట్ ఫండ్స్కు వల్ల పన్ను లాభాలూ ఉంటాయి.
బంగారంలో పెట్టుబడులు
మన ఇంట్లో వాడకంలో లేని బంగారాన్ని పెట్టుబడిగా పెట్టడం ద్వారా, ఎటువంటి పన్నులూ లేని 2.75 శాతం వడ్డీని పొందవచ్చు. ఫైనాన్షియల్ ప్లానర్లలో ఈ విధానం అత్యుత్తమమని 21.3 శాతం మంది, మంచిదని 46.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. వడ్డీ తక్కువే అయినప్పటికీ, 2016లో బంగారం ధర ఓ 5 శాతం పెరిగిందనుకుంటే, వార్షిక రాబడి 7.75 శాతమవుతుంది.
సుకన్య సమృద్ధి స్కీమ్
కుమార్తె ఉండి ఆ బాలికకు 10 సంవత్సరాల కన్నా తక్కువ వయసుంటే, ఈ పథకం ఎంతో ఉత్తమమని 17 శాతం మంది, మంచిదని 31.9 శాతం మంది అభిప్రాయపడ్డారు. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం, ప్రస్తుతానికి ఆశించిన స్థాయిలో లేనప్పటికీ, భవిష్యత్ అవసరాలను తీర్చడంలో ఎలాంటి సందేహాం లేదని అంచనా. కనీసం రూ. 1000తో పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రభుత్వం ఇచ్చే వడ్డీపై అదనంగా ముప్పావు శాతం సుకన్యా పథకంలో లభిస్తుంది. అమ్మాయి 21 సంవత్సరాలు వచ్చే వరకూ పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకంలో ఎలాంటి పన్నులూ ఉండవు.
ఇంటి కొనుగోలు యత్నం
గడచిన ఏడాదిన్నరగా నిర్మాణ రంగం కుదేలైన సంగతి తెలిసందే. 2016లో సొంతింటి కల మరింత సులువుగా నెరవేర్చుకోవచ్చని నిపుణుల అంచనా. కొత్త గృహ యత్నాలు చేయడం అత్యుత్తమమని 17 శాతం మంది, మంచిదని 27.7 శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు.