జొమాటో కొత్త బాదుడు.. క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లపై రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు ఫీజు వసూలు..
ఫుడ్ డెలివరీ దిగ్గజం 'ఎటర్నల్' అనుబంధ సంస్థ అయిన జొమాటో.. క్యాష్ ఆన్ డెలివరీ (COD) ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే వినియోగదారులపై అదనపు భారాన్ని మోపడం ప్రారంభించింది. మార్కెట్లో తీవ్రమవుతున్న పోటీ వాతావరణంలో వివిధ చెల్లింపు పద్ధతుల ద్వారా ఆదాయాన్ని మరింతగా రాబట్టుకునే వ్యూహంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 'డెలివరీ సమయంలో చెల్లింపు రుసుము' (Pay on Delivery Fee) పేరుతో ప్రత్యేక ఛార్జీని యాప్ బిల్లింగ్ సారాంశంలో పొందుపరిచింది.
ఈ అదనపు రుసుము సాధారణంగా రూ.5 గా ప్రారంభమవుతున్నప్పటికీ, వేర్వేరు ఆర్డర్లు, ప్రాంతాలను బట్టి వినియోగదారులకు రూ.7 నుండి రూ. 20 వరకు కూడా వసూలు చేస్తున్నట్లు పలు నివేదికలు, యాప్ స్క్రీన్షాట్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ కొత్త ఛార్జీ పూర్తిగా డెలివరీ సమయంలో నగదు చెల్లించే ఆర్డర్లకు మాత్రమే వర్తిస్తుందని, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ పద్ధతులలో ఆన్లైన్ చెల్లింపులు చేసే వినియోగదారులకు ఈ రుసుము నుండి పూర్తిగా మినహాయింపు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతం అమలులో ఉన్న ప్లాట్ఫారమ్ ఫీజు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ వ్యయాలు, వర్తించే జీఎస్టీలతో సంబంధం లేకుండా ఈ సీఓడీ ఛార్జీని విడిగా వసూలు చేస్తున్నారు. 2023లో ఫుడ్ డెలివరీ రంగానికి ప్లాట్ఫారమ్ రుసుములను పరిచయం చేసినప్పుడు స్విగ్గీ మొదట ₹2 తో ప్రారంభించగా, ఆ తర్వాత జొమాటో కూడా దానిని అనుసరించి ఇటీవలే తన ప్లాట్ఫారమ్ రుసుమును రూ. 12.50 నుండి రూ. 14.99 కి పెంచిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం జొమాటో రోజువారీగా సగటున 23 లక్షల నుండి 25 లక్షల ఆర్డర్లను నిర్వహిస్తున్నందున, ఆర్డర్కు విధించే అత్యల్ప ఫీజు కూడా కంపెనీకి ఏడాదికి కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది. ఈ క్రమంలో రాపిడోకు చెందిన 'ఓన్లీ', ఫ్లిప్కార్ట్ ప్రారంభించిన 'ఈట్ ఇన్' వంటి కొత్త పోటీదారులు రంగంలోకి దిగినప్పటికీ జొమాటో తన ఆర్డర్ల పరిమాణాన్ని స్థిరంగా కొనసాగిస్తోంది. అయితే, జొమాటో ప్రధాన ప్రత్యర్థి స్విగ్గీ మాత్రం ఇప్పటివరకు క్యాష్ ఆన్ డెలివరీపై ఎటువంటి ప్రత్యేక రుసుమును విధించలేదు.
మరొకవైపు కంపెనీ తన ఆపరేషనల్ మోడల్, కస్టమర్ సర్వీస్ నిర్వహణపై జరిపిన సమీక్ష అనంతరం ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు త్రైమాసికంలో దాదాపు 250 మంది ఉద్యోగులను తొలగించింది. అంతర్గత వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఆర్థిక వ్యూహంతో హైదరాబాద్లోని తన 'కస్టమర్ డిలైట్' విభాగం కార్యకలాపాలను పూర్తిగా మూసివేసి, మిగిలిన సేవలన్నింటినీ గురుగ్రామ్లోని ఒకే ప్రధాన కేంద్రానికి తరలించి కేంద్రీకరించింది.


Click it and Unblock the Notifications

