zomato: సాంకేతికత పెరుగుతుండటంతో ప్రజల జీవన విధానాలు మరింత మెరుగుపడుతున్నాయి. గతంలో ఉదయాన్నే లేచి వంటచేస్తేనే కాని టిఫిన్, భోజనం అయ్యేవి కావు. ఫుడ్ డెలివరీ సంస్థలు ఇప్పుడు ఆ లోటును తీరుస్తున్నాయి. సమయంతో పనిలేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు, నచ్చిన ఆహార పదార్ధాలను నిమిషాల వ్యవధిలో ముందు ఉంచుతున్నాయి. ఈ విభాగంలో ప్రముఖంగా వినిపించే పేరు జొమాటో. 1,000 కంటే ఎక్కువ నగరాల్లో ఈ సంస్థ సేవలందిస్తుండగా.. తాజాగా కొన్ని చోట్ల నుంచి నిష్క్రమించినట్లు పేర్కొని షాకిచ్చింది.

గత నెల నుంచే..
సుమారు 225 చిన్న నగరాల్లో తమ సేవలను నిలిపివేసినట్లు ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసిక ఫలితాల నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం Q3లో గ్రాస్ ఆర్డర్ విలువ(GOV) 0.3 శాతం ఉన్న ప్రాంతాల నుంచి నిష్క్రమించినట్లు పేర్కొంది. గతనెల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు చెప్పింది.

అంతగా ప్రభావం ఉండదు:
"గత కొన్ని త్రైమాసికాలుగా 225 నగరాల్లో వ్యాపారం ప్రోత్సాహకరంగా లేదు. పెట్టిన పెట్టుబడిపై అనుకున్న స్థాయిలో ఆదాయం పొందలేకపోతున్నాం" అని జొమాటో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షంత్ గోయల్ తెలిపారు. కంపెనీ ఖర్చులపై ఈ చర్యలు ఎంత ప్రభావాన్ని చూపిస్తాయన్న ప్రశ్నకు.. పెద్దగా ప్రభావం ఉండదు అని బదులిచ్చారు.

దేశవ్యాప్త మందగమనం:
అనుబంధ సంస్థలు Blinkit, Hyperpureతో కలిపి చూస్తే.. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం 75 శాతం పెరిగి రూ.1,948 కోట్లకు చేరుకుంది. కానీ నష్టం 5 రెట్లు పెరిగి రూ.346 కోట్లకు వెళ్లింది. గత అక్టోబరు నుంచి చూస్తే ఫుడ్ డెలివరీ పరిశ్రమలో వ్యాపారం మందగించడమే ఇందుకు కారణమని జొమాటో యాజమాన్యం తెలిపింది. దీని ప్రభావం దేశవ్యాప్తంగా కనిపించినా, 8 నగరాల్లో ఎక్కువగా ఉందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications