Zomato IPO: షేర్ హోల్డర్లను ఆకట్టుకోవడానికి స్కెచ్: బ్యాడ్మింటన్ ప్లేయర్కు బిగ్ ఆఫర్
ముంబై: టాప్ ఆన్లైన్ ఫుడ్ డెలివరి కంపెనీ జొమాటో.. త్వరలో షేర్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను ప్రకటించబోతోంది. త్వరలో పబ్లిక్ ఇష్యూకు వెళ్లబోతోంది. షేర్లను విక్రయించడం ద్వారా కనీసం అయిదున్నర మిలియన్ డాలర్ల మేర ఫండ్స్ను వసూలు చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లను కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి జొమాటో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ తన పబ్లిక్ ఇష్యూను జారీ చేసే అవకాశం ఉంది.
ఈ పరిణామాల మధ్య జొమాటో సంస్థ యాజమాన్యం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ను మరింత విస్తృతం చేసింది. కొత్తగా నలుగురు బోర్డు డైరెక్టర్లను నియమించింది. ఆ నలుగురూ ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారని వెల్లడించింది. ఈ నలుగురూ మహిళలే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొత్తగా అయిదుమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను తీసుకున్నామని, వారిలో నలుగురు మహిళలే కావడం తనకు ఆనందాన్ని ఇస్తోందని జొమాటో సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి దీపీందర్ గోయెల్ వెల్లడించారు.
ఈ నలుగురిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, మాజీ ఒలింపియన్ అపర్ణా పోపట్ ఒకరు. జలోరా గ్రూప్ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారిణి గుంజన్ తిలక్రాజ్ సోని, ఎయిర్ వేద వ్యవస్థాపకురాలు నమితా గుప్తా, ఏబీఎన్ ఆమ్రో బ్యాంక్ ఎన్వీ (ఇండియా) ప్రైవేట్ వెల్త్ బిజినెస్ మాజీ అధినేత్రి సుతాప బెనర్జీని బోర్డులోకి తీసుకుంది. వారితో పాటు దీపీందర్ గోయెల్ ఇన్ఫో ఎడ్జ్ ఫౌండర్ సంజీవ్ భిక్చందాని, యాంట్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డగ్లస్ ఫియాగిన్, కౌశిక్ దత్తా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా కొనసాగుతారు.
సంస్థలో మాతృత్వ, పితృత్వ సెలవులను సమానంగా అందజేస్తున్నామని, అదే రకంగా కొత్తగా నలుగురు మహిళా డైరెక్టర్లు రానుండటంతో బోర్డు కూడా సమతుల్యంగా ఉంటుందని చెప్పారు. సేమ్ సెక్స్, సరోగేట్స్, అడాప్టివ్ పేరెంట్స్, పీరియడ్స్/మెన్స్ట్రుయేషన్ లీవ్స్ అందరికీ సమానంగా ఇస్తున్నామని దీపీందర్ వెల్లడించారు. కొత్తగా బోర్డులోకి తీసుకున్న అయిదుమంది డైరెక్టర్లు.. తమ సంస్థను మరింత పురోగమింపజేస్తారనడంలో ఎలాంటి సందేహాలు లేవని వ్యాఖ్యానించారు.