ఆరోగ్యవంతమైన ఉద్యోగికి నెలజీతం బోనస్.. రూ.10 లక్షల రివార్డ్ కూడా.. భారతీయ కంపెనీ సూపర్ ఆఫర్
Zerodha Challange: ఎక్కడైన ఉద్యోగులకు ఎలాంటి ఛాలెంజ్ లు ఇస్తారు మహా అయితే పనికి సంబంధించిన వాటిలో ఉంటాయి. కానీ ఈ భారతీయ కంపెనీ వేరే లెవల్. ఇక్కడ ఉద్యోగుల ఆరోగ్యానికి యాజమాన్యం ఎక్కువగా ప్రధాన్యతనిస్తుంటుంది. వారు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఛాలెంజ్ లను ఇస్తూ.. వారికి క్యాష్ రివార్డులను సైతం కంపెనీ అందిస్తోంది. వినటానికి ఇది బలే ఉంది కథ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్ బ్రోకర్..
ఆన్లైన్ స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ సంస్థ Zerodha సహ వ్యవస్థాపకుడు, CEO అయిన నితిన్ కామత్ ఉద్యోగుల ఆరోగ్య విషయంలో మెుదటి నుంచి ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు. అలాంటి ఆయన శనివారం తన కంపెనీ ఉద్యోగులకు కొత్త ఛాలెంజ్ ఇచ్చారు. ఇందుకోసం కొత్త ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రకటించారు. కామత్ తన ఉద్యోగులకు వారి ఫిట్నెస్ ట్రాకర్లపై రోజువారీ కార్యాచరణ లక్ష్యాలను సెట్ చేయమని సవాలు చేశారు. దీంతో పాటు వచ్చే ఏడాది నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకునే వారికి బోనస్ కూడా ప్రకటించారు.
వ్యాధులకు దూరం చేసేందుకు..
తాము తమ టీమ్కి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నామని కామత్ లింక్డ్ఇన్ పోస్ట్లో వెల్లడించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నామని అన్నారు. ఇందుకోసం హెల్త్ ఛాలెంజ్ పెట్టినట్లు వివరించార. "మనలో చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నాము (WFH), ఇది బరువు పెరుగుటకు దారి తీస్తోంది. అదే సమయంలో అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి" అని అభిప్రాయపడ్డారు. వీటి నుంచి దూరం చేసేందుకే కొత్త ఛాలెంజ్ తెచ్చినట్లు తెలిపారు.
అసలు ఛాలెంజ్ ఏమిటి..?
వచ్చే ఏడాది నాటికి తమ రోజువారీ లక్ష్యంలో 90% చేరుకునే ఉద్యోగికి బోనస్ ఇవ్వబడుతుందని కామత్ తెలిపారు. ఒక నెల జీతం బోనస్గా ఇవ్వబడుతుంది. దీనితో పాటు ఉద్యోగుల్లో ప్రేరణను పెంచడానికి కంపెనీ 10 లక్షల రూపాయల లక్కీ డ్రాను కూడా తీసుకొచ్చింది. Zerodha అనేది భారతీయ ఆర్థిక సేవల కంపెనీ. ఇది స్టాక్ మార్కెట్లో షేర్ల ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పిస్తుంది.