'భారతి' ఆస్తుల జఫ్తుపై కోర్టు కీలక ఉత్తర్వులు, జగన్ సహా వీరికి నోటీసులు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులోని భారతి సిమెంట్స్లో ఈడీ జఫ్తు చేసిన ఆస్తులపై యథాస్థితిని కొనసాగించాలని ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భారతి సిమెంట్స్ కేసులో 2016 జూన్లో రూ.749 కోట్ల స్థిర, చరాస్తులను గతంలో ఈడీ తాత్కాలికంగా జఫ్తు చేసింది.
అమరావతికి రూ.1 లక్షకోట్లు: జగన్ ప్రభుత్వానికి భారంగా రాజధాని
నాడు జగన్ ఆస్తులు అటాచ్
ఈడీ తాత్కాలికంగా జఫ్తు చేసిన వాటిల్లో జగన్, ఆయన కంపెనీలకు చెందిన రూ.569.57 కోట్లు, ఆయన భార్య భారతికి చెందిన రూ.22.31 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన తాత్కాలిక జఫ్తు ఉత్తర్వుల్ని అడ్జ్యుటికేటింగ్ అథారిటీ ధృవీకరించింది. దీనిపై జగన్, భారతి, సండూరు పవర్స్ తదితర సంస్థలు అప్పిలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించాయి. విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ ఈడీ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన తాత్కాలిక జఫ్తు ఉత్తర్వులు చెల్లవని జూలైలో తీర్పు ఇచ్చింది.
యథాతథస్థితి..
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఆస్తుల జఫ్తుకు సంబంధించి అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జగన్, భారతిలకు నోటీసులు
ప్రతివాదులుగా ఉన్న జగన్, భారతి, కంపెనీలు, వివిధ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. వివిధ కేసుల్లో ఏ1గా ఉన్న ఆయనకు ఇటీవల సీబీఐ కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.