YouTube: ఇప్పటికే ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీలు ఆశించిన స్థాయిలో సంపాదన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పైగా ఫండింగ్ లేకపోవటంతో ఖర్చుల మదింపు చర్యల్లో భాగంగా వేల సంఖ్యలో ఉద్యోగులను సైతం నిర్ధాక్ష్యన్యంగా తొలగిస్తున్నాయి.
అయితే ఇప్పుడు బైజూస్, అనాకాడెమీ వంటి దేశీయ ఎడ్-టెక్ కంపెనీలను భారీ ఎదురుదెబ్బ తగలనుంది. వీడియో కంటెంట్ ప్రొవైడర్ YouTube ఈ క్రమంలో కోర్సులు అనే విద్యా-కేంద్రీకృత ఫీచర్ను భారతదేశంలో అందుబాటులోకి తెస్తోంది. గూగుల్ ఫర్ ఇండియా- 2022 ఈవెంట్ సందర్భంగా యూట్యూబ్ ఇండియా హెడ్ ఇషాన్ ఛటర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీ ఈ ఫీచర్ ను 2023 ఆరంభంలో ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు.

ఈ ఫీచర్ సర్టిఫైడ్ క్రియేటర్లు తమ కంటెంట్ను మానిటైజ్ చేయడానికి అనుమతిస్తుందని కంపెనీ వెల్లడించింది. అంటే ఇకపై యూట్యూబ్ కస్టమర్లకు ఉచిత, పెయిడ్ కోర్సులను అందించనుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో ప్రీమియం సబ్స్క్రైబర్లు యాడ్స్ లేకుండా కోర్సులను చూసేందుకు వెసులుబాటు ఉందని కంపెనీ చెప్పింది.
రానున్న రోజుల్లో ఎంపిక చేసిన భాగస్వాములు, కంటెంట్ క్రియేటర్లతో సర్వీసుల బీటా వెర్షన్ అందుబాటులోకి వస్తుందని యూట్యూబ్ వెల్లడించింది. అయితే బీటా దశలో కంపెనీ కోడింగ్ లాంగ్వేజ్, ఫ్రొఫెషనల్ స్కిల్స్, ఎంటర్ ప్రెన్యూరల్ స్కిల్స్, పర్సనల్ ప్యాషన్ వంటివి కీలక ఫోకస్ ఏరియాలుగా ఉన్నాయని తెలుస్తోంది. ఫీచర్పై అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత ఈ విభాగాలను పొడిగించాలని YouTube యోచిస్తోంది.
ఈ ఫీచర్ కింద ఫోటోలు, పీడీఎఫ్ లు, డాక్యుమెంట్లు వంటి అనుబంధ కంటెంట్ను అప్లోడ్ చేయడానికి కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ అనుమతిస్తోంది. ఇతర కంటెంట్ క్రియేటర్ల పాలసీల మాదిరిగానే రెవెన్యూ షేరింగ్ ఉంటుందని, క్రియేటర్లు యాడ్ రాబడిలో 55% పొందుతారని కంపెనీ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications