WPI Inflation: భారతదేశ టోకు ద్రవ్యోల్బణం అంటే డబ్ల్యుపీఐ జూన్లో -4.12 శాతం తగ్గిన తర్వాత జూలై నెలలో ఏడాది ప్రాతిపదికన -1.36 శాతానికి తగ్గింది. ఇంధన ధరలను తగ్గించడం, ఆహార ధరల పెరుగుదల మధ్య WPI ద్రవ్యోల్బణం సున్నా కంటే తక్కువగా ఉండటం ఇది వరుసగా నాలుగో నెల.
ఏప్రిల్ నుంచి దేశంలో టోకు ద్రవ్యోల్బణం సున్నా కంటే దిగువన కొనసాగుతోంది. జూన్లో ద్రవ్యోల్బణం -4.12 శాతానికి చేరడం సెప్టెంబర్ 2015 తర్వాత కనిష్ట స్థాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జూన్లో 1.32 శాతంగా ఉన్న ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం జూలైలో 14.25 శాతానికి చేరుకుంది. జూలై 2023లో ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధానంగా ఖనిజ నూనెలు, ప్రాథమిక లోహాలు, రసాయనాలు & రసాయన ఉత్పత్తులు, వస్త్రాలు, ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గుదల కారణంగా నిలిచింది.

పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గత వారం వరుసగా మూడోసారి పాలసీ రేటు రెపోను 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై చర్యలు ఇంకా ముగియలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆహార వస్తువులు, ఇంధన ధరల్లో అస్థిరత, కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, వాతావరణ సంబంధిత అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణ ప్రమాదాలు మిగిలి ఉన్నాయి.

ఆహార పదార్థాల ధరల ఒత్తిడి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 ద్రవ్యోల్బణం అంచనాను 5.1 శాతం నుంచి 5.4 శాతానికి ఆర్బిఐ పెంచింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.2 శాతంగా అంచనా వేయబడగా.. ఇది గతంలో అంచనా వేసిన 5.2 శాతం కంటే అధికం కావటం సామాన్యులను మళ్లీ ఆందోళనలకు గురిచేస్తోంది.


Click it and Unblock the Notifications