WPI inflation..మైనస్లో: మూడేళ్ల తరువాత తొలిసారి
న్యూఢిల్లీ: దేశీయ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. మైనస్లోకి వెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలో అంటే ఏప్రిల్లో మైనస్గా నమోదైంది. ఏప్రిల్లో -0.92 శాతంగా నమోదైంది. మార్చిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 1.34 శాతం మేర నమోదు కాగా.. ఆ తరువాతి నెల అంటే ఏప్రిల్లో -0.92 శాతానికి పడిపోయింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ఈ వివరాలను వెల్లడించింది.
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం మైనస్లోకి వెళ్లడం మూడు సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. 2020 జూన్లో కూడా డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ మైనస్లో వెళ్లింది. ఆ స్థాయిలో పడిపోవడం మళ్లీ ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం పతనం కావడం వరుసగా ఇది 11వ నెల. ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం మార్చిలో 2.40 శాతం కాగా.. ఏప్రిల్లో 1.60 శాతానికి తగ్గింది.
ఇంధనం మరియు విద్యుత్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 0.93 శాతానికి తగ్గింది. అంతకుముందు నెలలో ఈ సంఖ్య 8.96 శాతంగా రికార్డయింది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మార్చిలో -0.77 శాతంగా నమోదు కాగా.. ఏప్రిల్లో -2.42 శాతానికి క్షీణించింది. ఏప్రిల్లో ఆహార ధరల ద్రవ్యోల్బణం 0.17 శాతానికి తగ్గింది. మార్చిలో ఇది 2.32 శాతంగా ఉండేది.
కొంత కాలంగా డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే. జనవరిలో 4.73 శాతంగా నమోదు కాగా..ఆ తరువాత నెల అంటే ఫ్రిబవరిలో 3.85 శాతం, మార్చిలో 1.34 శాతానికి దిగజారింది. డబ్ల్యుపీఐ పతనం కావడం వల్ల రిటైల్ ధరలతో పాటు వాటి పెరుగుదలను నియంత్రించే అవకాశాలు ఉందని అంటున్నారు. ధరల తగ్గుదలపై సానుకూల ప్రభావం చూపుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
దేశీయ కన్జ్యూమర్ ఇండెక్స్ ప్రైస్లో కూడా తగ్గదుల చోటు చేసుకుంది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్లో బాగా తగ్గింది. 18 నెలల కనిష్ఠ స్థితికి అంటే 4.70 శాతానికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన మానిటరింగ్ పాలసీలో పొందుపరిచిన విధానాల వల్ల ధరల పెరుగుదలకు సంబంధించిన ఈ కన్జ్యూమర్ ఇండెక్స్ ప్రైస్ను పరిగణనలోకి తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్లో తక్కువ సీపీఐ నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించ వచ్చనే అంచనాలు ఉన్నాయి.