రెండో నెల పెరిగిన హోల్సేల్ ధరల సూచీ ద్రవ్యోల్భణం, 27 నెలల గరిష్టానికి
హోల్సేల్ ఆధారిత ద్రవ్యోల్భణ సూచీ (WPI) వరుసగా రెండో నెల పెరిగింది. ఫిబ్రవరి నెలలో WPI 4.17 శాతంగా నమోదయింది. ఆహార పదార్థాలు, చమురు, విద్యుత్ ధరలు పెరగడమే ఇందుకు కారణం. జనవరిలో WPI 2.03 శాతంగా నమోదయింది. 2020 ఫిబ్రవరి నెలలో 2.26 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 27 నెలల గరిష్టస్ధాయిలో ఫిబ్రవరిలో ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింది. గత నెలతో పోలిస్తే ఆహార ఉత్పత్తుల ధరలు, తయారీ వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ఈ రెండు ఉత్పత్తుల ధరలు వరుసగా 3.31 శాతం, 5.81 శాతం పెరిగాయి.
జనవరిలో మైనస్ 2.8 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్భణం 1.36 శాతంగా నమోదైంది. కూరగాయల ద్రవ్యోల్బణం జనవరిలో మైనస్ 20.82 శాతంగా ఉండగా, ఫిబ్రవరిలో మైనస్ 2.90 శాతంగా ఉంది. తృణధాన్యాల ధరలు ఫిబ్రవరిలో 10.25 శాతం వరకు, పండ్ల ధరలు 9.48 శాతం పెరిగాయి. ఇంధన, విద్యుత్ రంగంలో ద్రవ్యోల్బణం మైనస్ 0.58 శాతంగా ఉంది.
మరోవైపు శుక్రవారం వెలువడిన ఆహార వస్తువుల ధరలు పెరగడంతో వినియోగదారు ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3 నెలల గరిష్టం 5.03 శాతానికి చేరింది. అలాగే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP) మళ్లీ క్షీణించింది. యంత్ర పరికరాలు, తయారీ, గనుల తవ్వక రంగాల్లో ఉత్పత్తి తగ్గడంతో జనవరిలో ఇది 1.6 శాతం మేర క్షీణించింది.