కొత్త కరోనా వేరియంట్ ప్రభావం: కుప్పకూలిన స్టాక్, సెన్సెక్స్ 1500 పాయింట్లు డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ స్టాక్ మార్కెట్కు కొత్త వేరియంట్ భయాలు పట్టుకున్నాయి. దీంతో చాలారోజులుగా లాభాల్లో దూసుకుపోయిన మార్కెట్లు ఇటీవల నష్టాల్లోకి జారుకున్నాయి. ఇటీవల సెన్సెక్స్ 62,000 దాటి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్లు ఇటీవల మందగించి, కాస్త నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్భణ భయాలకు తోడు కొత్త వేరియంట్ భయం ఆజ్యం పోసింది. దీంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. మార్కెట్లు గత కొద్ది సెషన్లుగా ఊగిసలాటలో ఉన్నాయి. ప్రధానంగా లాభాల స్వీకరణ ప్రభావం కనిపించింది. నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ పరుగు కారణంగా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
మార్కెట్ బేర్ ఎందుకు?
ఇప్పటికే అంతర్జాతీయంగా ద్రవ్యోల్భణ భయాలు మార్కెట్ పైన ప్రభావం చూపుతున్నాయి. ఐరోపా, అమెరికాలో కరోనా కేసులు, తాజాగా దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ పుట్టుకు రావడం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ 2.5 శాతం మేర పడిపోయింది. అమెరికా ఫ్యూచర్ క్రూడ్ రెండు శాతం క్షీణించింది. భారత మార్కెట్ పైన కూడా కొత్త వేరియంట్ ప్రభావం పడింది. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ వంటి దిగ్గజ షేర్లు నష్టపోయాయి.
1500 పాయింట్లు డౌన్
ఉదయం సెన్సెక్స్ 500 పాయింట్ల నష్టంతో 58,254.79 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఏ దశలోను కోలుకోలేదు. పైగా అంతకంతకూ క్షీణించింది. ప్రారంభమైన 58,254.79 వద్దే గరిష్టాన్ని తాకింది. 57,278 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం ఓ సమయంలో 1400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, ఆ తర్వాత అదే స్థాయిలో కనిపించినప్పటికీ, మధ్యాహ్నం గం.1.45 సమయానికి 1500 పాయింట్ల పతనం నమోదు చేసింది. 2.55 శాతం మేర సెన్సెక్స్ కుప్పకూలింది. నిఫ్టీ కూడా 17,338.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,355.40 గరిష్టాన్ని, 17,088.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1.45 సమయానికి 438.90 (2.51%) పాయింట్లు నష్టపోయి 17,097.35 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
నెలల కనిష్టానికి
ఆసియా సూచీలు రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి. చాలామంది ఇన్వెస్టర్లు సురక్షిత బాండ్స్ వైపు చూస్తున్నారు. హెల్త్ రంగం మినహా మిగతా స్టాక్స్ అన్నీ నష్టపోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. బీఎస్ఈలో 2192 షేర్లు ఉండగా 900 లోపు షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.